వెలగపూడిలో చంద్రబాబు పర్యటన | chandrababu visited AP Secretariat site at Velagapudi in Guntur | Sakshi
Sakshi News home page

వెలగపూడిలో చంద్రబాబు పర్యటన

Mar 25 2016 7:20 PM | Updated on Aug 18 2018 5:48 PM

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరిశీలించారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్  తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి వచ్చారు. వెలగపూడిలో ఆరు బ్లాకులుగా చేపట్టిన తాత్కాలిక సచివాలయం పనుల పురోగతిపై మంత్రులు, అధికారులను ఆరా తీశారు. తొలుత హెలికాప్టర్‌లో మూడు పర్యాయాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన సీఎం వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయం పనులను పైనుంచి(ఏరియల్ వ్యూ) పరిశీలించారు.

అనంతరం వెలగపూడిలోని సచివాలయ నిర్మాణ ప్రాంతంలో కాలినడక కలియతిరిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తాత్కాలిక సచివాలయ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి ఏర్పాటు చేసిన ఎతైన వేదిక నుంచి నిర్మాణ పనులు పరిశీలించారు. నిర్మాణ నమూనా మ్యాప్‌ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం సమీపంలోని మల్కాపురంలోని పురాతన శివాలయం, నంది విగ్రహం, పురాతన చరిత్ర కలిగిన బౌద్ధస్థూపం(శిలాశాసనం)లను పరిశీలించారు.

ఆ తర్వాత రాజధాని భవనాల డిజైనింగ్‌పై నిపుణుల పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను సీఎం మంత్రులు, అధికారులు పరిశీలించారు. ప్రభుత్వానికి జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్‌... లండన్‌కు చెందిన రోజెస్‌ స్టిర్క్‌ హార్లల్‌... భారత్‌కు చెందిన వాస్తు శిల్పి సంస్థలు ఈ డిజైన్లు సమర్పించాయి. వీటిలో జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్‌ డిజైన్‌ను ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. అంతకముందు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్ని చంద్రబాబు మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు, నిర్మాణాలు చేపడతున్న సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement