చంచల్గూడ జైలును నగరానికి దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* 500.21 ఎకరాల భూమి గుర్తింపు
* ప్రభుత్వానికి ప్రతిపాదనలు
* శాంతిభద్రతల దృష్ట్యా తరలింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చంచల్గూడ జైలును నగరానికి దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నడిబొడ్డున కేంద్ర కారాగారం ఉండడం.. ఖైదీల తరలింపు, వీఐపీ ఖైదీల తాకిడి నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని అంచనా వేసిన సర్కారు.. ఈ జైలును రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
దీంతో యాచారం మండలం మొండిగౌరెల్లి, షాబాద్ మండలం చందన్వెల్లి, వికారాబాద్ మండలం సిద్దలూరు, మం చాల మండలం తాళ్లపల్లిగూడలో అనువైన భూము ల జాబితాను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. కనిష్టంగా 500 ఎకరాల విస్తీర్ణం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, ఒకేచోట అంత భూ లభ్యత లేకపోవడంతో ఒకే రెవెన్యూ పరిధిలో వేర్వేరు పార్శిళ్లలో భూములను అన్వేషిస్తోంది. సిద్దలూరులో సర్వే నంబర్ 176, 263, 217లలోని 500.21 ఎకరాలు, మొండిగౌరెల్లిలో సర్వేనం. 19, 68, 127లలో వేయి ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించింది. తాళ్లపల్లిగూడ సర్వే నంబర్ 84లో 472 ఎకరాలు, చందన్వెల్లి సర్వే 190లో 500 ఎకరాలు ఎంపిక చేసి ప్రతిపాదనలను సర్కార్కి పంపింది.
జైలు స్థానంలో రెసిడె న్షియల్ స్కూళ్లు
చంచల్గూడ జైలులోని ఖైదీలను విచారణ నిమిత్తం జైలు నుంచి కోర్టుకు.. అక్కడి నుంచి తిరిగి జైలుకు తీసుకురావడం ఇబ్బందిగా పరిణమించింది. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఇది సురక్షితం కాదని ప్రభుత్వం.. దీన్ని రంగారెడ్డి జిల్లాకు తరలించాలని భావించింది. దీనికి సీఎం కేసీఆర్ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కాగా, జైలు స్థానంలో మైనార్టీ బాల, బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.