
ప్రియుడి ఇంటిఎదుట యువతి బైఠాయింపు
ప్రేమించానన్నాడు.. జీవితాంతం తోడుంటానని బాసలు చేశాడు. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసు కుంటానని మాటిచ్చాడు.
సిరిసిల్ల టౌన్ : ప్రేమించానన్నాడు.. జీవితాంతం తోడుంటానని బాసలు చేశాడు. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసు కుంటానని మాటిచ్చాడు. ఇంతలోనే ఏమైందో ఏమో పెళ్లి చేసుకుందామని ప్రియురాలు కోరగా.. కుదరదని ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోరాటానికి దిగింది. ఈ సంఘటన సిరిసిల్లలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. సిరిసిల్ల మండలం తాడూరుకు చెందిన కొత్వాల శిరీష(23) ఇంటర్ పూర్తిచేసి బ్యుటీషియన్గా పనిచేస్తోంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన బైరి చందు(25) మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఫోన్లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే స్నేహం ప్రేమగా మారింది.
ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు. శిరీషను చందు కుటుంబ సభ్యులకు చూపించాడు. ఏడాది క్రితం ప్రియురాలి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని అడిగాడు. కులాలు వేరని చెప్పినా వినకుండా పెళ్లికి ఒప్పించాడు. తన చెల్లెకు పది తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలుపగా...శిరీష తండ్రి హన్మాండ్లు తాను కూడా కూతురుకు అంతే మొత్తంలో కట్నకానుకలు ముట్టజెబుతానన్నాడు. ఇక పెళ్లికి సిద్ధమవుతుండగా వారం రోజులుగా చందు పెళ్లి చేసుకోవడం కుదరదని ముఖం చాటేస్తున్నాడు.
దీంతో కోపోద్రిక్తురాలైన శిరీష తనతో ప్రేమాయణం జరిపిన సాక్ష్యాలతోపాటు ప్రగతినగర్లోని చందు ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం పెరిగి పెద్దదవుతుందన్న భావనతో చందు ఇంట్లోవారు తాళం వేసుకుని వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని శిరీష భీష్మించుకుని కూర్చుంది. ఆమెకు మహిళ, కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.