రక్తం మరగడం ఆగిందా బాబూ! | babu how is your blood | Sakshi
Sakshi News home page

రక్తం మరగడం ఆగిందా బాబూ!

Sep 28 2016 1:56 AM | Updated on Oct 30 2018 7:27 PM

ప్రత్యేక హోదాపై రక్తం మరుగుతోందని.. నెలక్రితం చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మరగడం ఆగిపోయిందా..

సాక్షి, కడప: ప్రత్యేక హోదాపై రక్తం మరుగుతోందని.. నెలక్రితం చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మరగడం ఆగిపోయిందా.. అందుకే ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని కొత్త పల్లవి ఎత్తుకున్నారా..అంటూ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వైఎస్సార్‌ జిల్లా తొండూరు మండలం మల్లేల గ్రామంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌ ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన బహిరంగసభలో అవినాష్‌రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని... అంతేకాకుండా రాయితీలు వర్థించడంతో ఎక్కువగా పరిశ్రమలు వస్తాయని  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి ఇంటి సమస్యగా భావించాలని.. అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు చెంపపై గట్టిగా చెల్లుమనిపించేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని.. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమన్నారు. రాయలసీమ సాగు నీటి విషయంలో చంద్రబాబుకు ఎంతమాత్రం చిత్తశుద్ధిలేదని అన్నారు. పట్టిసీమ ద్వారా రైతులకు నీరు ఇవ్వడమంటే మోసం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ 11వేల క్యూసెక్కులనుంచి 44వేల క్యూసెక్కుల నీరు తీసుకొచ్చేలా విస్తరణకు శ్రీకారం చుట్టారని.. తెలంగాణా, కోస్తాంధ్ర ప్రజలు వ్యతిరేకించినా అప్పట్లోనే 80శాతం పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 20శాతం పనులను అటు కాంగ్రెస్, ఇటు అధికారంలో ఉన్న టీడీపీ పనులు పూర్తి చేయకపోవడం చూస్తే సీమ ప్రాజెక్టులపై ఎంత శ్రద్ధ ఉందో  అర్థమవుతోందన్నారు.

దీనిని విస్తరించి ఉంటే శ్రీశైలంలో జలం ఉంటే మన ప్రాజెక్టులకు నీరు వచ్చేవని.. గండికోటలో 27టీఎంసీల నీరు నిల్వ చేస్తే జిల్లా సస్యశ్యామలంగా మారేదని అన్నారు.. మైకు ఇస్తే గొప్పలు చెప్పుకొనే టీడీపీ నాయకులు ఎందుకు ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం విస్మరించిందో చెప్పాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement