ప్రియుడే హంతకుడు | assassin girl friend | Sakshi
Sakshi News home page

ప్రియుడే హంతకుడు

Oct 20 2016 11:57 PM | Updated on Jul 30 2018 8:29 PM

ప్రియుడే హంతకుడు - Sakshi

ప్రియుడే హంతకుడు

పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణిని ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.

– వీడిన సంధ్యారాణి కేసు మిస్టరీ
- పెళ్లికి పట్టుబట్టడంతో కడతేర్చారు
- కుటుంబీకులతో కలసి గొంతునిలిమి చంపేసిన విద్యాశాఖ ఉద్యోగి
- కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
   
కర్నూలు: పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణిని ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. 13 రోజుల్లో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేశారు. గురువారం మృతదేహాన్ని పూడ్చిన చోట జేసీబీ సహాయంతో వెలికి తీశారు. డీఈఓ కార్యాలయంలోని సర్వశిక్ష అభియాన్‌ విభాగంలో సీనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్న నూర్‌ అహ్మద్‌ 2011లో ఆళ్లగడ్డలో విద్యాశాఖలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేసేవాడు. అదే సమయంలో ఆళ్లగడ్డలో సరస్వతి స్కూలు కూడా నిర్వహించే వాడు. ఇందులో నర్సరీ టీచర్‌గా సంధ్యారాణి పని చేసేది. అప్పటి నుంచి అతనితో పరిచయం ఉంది. 2013లో నూర్‌అహ్మద్‌ సీనియర్‌ అసిస్టెంటుగా కర్నూలుకు బదిలీపై వచ్చాడు. బుధవారపేటలోని గట్టప్ప స్కూలు వద్ద ఓ రూము అద్దెకు తీసుకొని ఉండేవాడు. మృతురాలు తరచూ అతని రూమ్‌కు వచ్చివెళ్లేది. వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని అతని భార్య పర్వీన్‌భాను వ్యతిరేకిస్తూ తరచూ గొడవపడేది. హతురాలు తనకు తెలిసిన వారి వద్ద రూ.3 లక్షలు నూర్‌అహ్మద్‌కు అప్పుగా ఇప్పించింది. వడ్డీతో పాటు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో పాటు, పెళ్లి చేసుకోవాలని, లేకుంటే పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెడతానంటూ బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడబలుక్కొని హత్య చేసేందుకు పథకం వేశారు. 
 
నెల క్రితమే హత్యకు పథకం
సంధ్యారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని, చంపేస్తే ఎటువంటి అడ్డు ఉండదని నూర్‌అహ్మద్‌ను అతని కుటుంబీకులు ఒప్పించారు. ఈ మేరకు నెల క్రితమే పథకం వేశారు. ఎక్కడైన చంపేసి మృతదేహాన్ని దూరంగా తరలించి పూడ్చి వేయాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పథకం ప్రకారం గతనెల 2వ తేదీన కర్నూలులోని బట్టల దుకాణం యజమాని ఇమ్రాన్‌ నుంచి ఓమినీ వాహనం కొనుగోలు చేసి దాన్ని రిపేరు చేయించి, బాలాజీ నగర్‌లో ఉన్న మేనల్లుడు మున్నా ఇంటి వద్ద పెట్టుకున్నారు. ఈనెల 7వ తేదీన సంధ్యారాణిని కర్నూలుకు రప్పించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమెను నూర్‌అహ్మద్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే మేనల్లుడు మున్నా, బామర్ది చాంద్‌బాషా, భార్య ఫర్వీన్‌ బాను తదితరులు మాటు వేసి ఉండి, గదిలోకి వెళ్లి అందరూ కలిసి గొంతు నులిమి, ముక్కుమూసి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన రాజశేఖర్‌ రెడ్డి పొలాన్ని నూర్‌అహ్మద్‌ కౌలుకు తీసుకొని డయిరీ ఫామ్‌ నిర్వహిస్తున్నాడు. అందులో అప్పటికే పెద్ద గుంత తీసి సిద్ధం చేశారు.  సంధ్యారాణి మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టి ఓమినీ వాహనంలో అక్కడికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. మరుసటి రోజు జేసీబీ సహాయంతో పేడ, మట్టితో కప్పిపెట్టారు. మృతురాలి సోదరి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించారు. నూర్‌అహ్మద్‌తో పాటు మున్నాను అరెస్టు చేశారు.
ఎస్పీ సమక్షంలో మృతదేహం వెలికితీత:
నిందితుడు నూర్‌అహ్మద్‌ ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు మధుసూదన్‌రావు, మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ జయన్న, కర్నూలు తహశీల్దారు రమేష్‌బాబు తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ సమక్షంలో మృతదేహాన్ని జేసీబీ సహాయంతో వెలికి తీశారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీంతో ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌ డాక​‍్టర్‌ రాజశేఖర్‌ను అక్కడికే రప్పించి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయిగురుదత్త వారి సహాయంతో మృతదేహాన్ని పాతబస్తీలోని జమ్మిచెట్టు ప్రాంతంలోని శ​‍్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసులో నూర్‌అహ్మద్‌భార్య పర్వీన్‌భాను, బామర్ది చాంద్‌బాషా పరారీలో ఉన్నారు. 
 
హతురాలి సోదరికి బెదిరింపులు:
నూర్‌ అహ్మద్‌ దగ్గరి బంధువు రహంతులా​‍్ల ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. సంఘటన జరిగిన తర్వాత నిందితుడు అతన్ని ఆశ్రయించాడు. కేసు నుంచి ఎలాగైనా తప్పించాలని వేడుకోవడంతో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ, నాగన్న మాదిగలకు రూ.2 లక్షలు డబ్బులు చెల్లించి, హతురాలు నాగలక్ష్మమ్మను బెదిరించి కేసు పెట్టకుండా బెదిరించారు. హత్య జరిగిన తర్వాత వరుసగా మూడు రోజుల పాటు బెదిరించడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా రెవెన్యూ కాలనీలోని ఆమె ఇంటిలో పోలీసులు సోదా చేయగా, రహంతుల్లా, వెంకటేశ్వర్లు మాదిగ, నాగన్న మాదిగలు బెదిరించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఫోన్‌ కాల్‌ డేటాతో పాటు సీసీ పుటేజీల ఆధారంగా వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ముందు సంధ్యారాణి శరీరంపై బంగారు గొలుసు, కమ్మలు, పట్టీలు ఉన్నాయని, వాటిని కూడా హంతకులు కాజేశారని సోదరి నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి విచారణ అధికారిగా నియమించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్టు చేసి, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement