హార్ట్ సర్జరీ కోసం రూ.2 లక్షలను అప్పు తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా ఓ దొంగ ఆ సొత్తును కాజేసి బాధితులకు వేదనను మిగిల్చాడు.
ఏలూరు: హార్ట్ సర్జరీ కోసం రూ.2 లక్షలను అప్పు తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా ఓ దొంగ ఆ సొత్తును కాజేసి బాధితులకు వేదనను మిగిల్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పెన్షన్లైన్లో నివసించే అబ్దుల్ జావీద్ భార్య గుండెజబ్జుతో బాధపడుతోంది. ఆమెకు సర్జరీ చేయించేందుకు జావీద్ శనివారం తాడేపల్లిగూడెంలోని తన సోదరుడి దగ్గర నుంచి రూ.2 లక్షలు అప్పు తీసుకుని వచ్చి ఇంట్లోని అల్మారాలో ఉంచాడు.
శనివారం అర్ధరాత్రి సమయంలో కిటికీ తెరచి ఉండడంతో ఓ దొంగ లోపలికి చేయి పెట్టి తలుపు గడియ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలో ఉంచిన నగదు, 8 కాసుల బంగారు ఆభరణాలను తీసుకుని వెళుతుండగా జావీద్కు మేల్కువ రావడంతో వెంబడించాడు. అయినా ఫలితం లేకపోయింది. దొంగ పరారు కావడంతో బాధితుడు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.