అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి చేర్చిన తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
రాయదుర్గం అర్బన్ : అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి చేర్చిన తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాయదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్లు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాపు మాట్లాడారు. ఈ నెల 16న రాయదుర్గంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ సమీపంలోని మద్దానేశ్వరస్వామి ఆలయంలో ఆ రోజు ఉదయం 9.30 గంటలకు జరిగే ప్లీనరీకి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.
ఇసుక దందాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రూ.కోట్లు గడిస్తున్నారన్నారు. ‘నీరు - చెట్టు’ పనుల్లో 50 శాతం మేర నిధులు అధికార పార్టీ నాయకుల జేబుల్లోకే వెళ్లాయని చెప్పారు. ఈ పనులపై విజిలెన్స్ అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మల్లికార్జున, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజనాయక్, పట్టణ కన్వీనర్ నబీష్, డీ.హిరేహాళ్ కన్వీనర్ వన్నూరుస్వామి, కణేకల్లు కన్వీనర్ ఆలూరి చిక్కన్న, గుమ్మఘట్ట కన్వీనర్ కాంతారెడ్డి, బొమ్మనహాళ్ కన్వీనర్ ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.