రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్ | 14 days remand for siricilla rajaiah and his family members | Sakshi
Sakshi News home page

రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్

Nov 5 2015 11:01 PM | Updated on Nov 6 2018 4:04 PM

రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్ - Sakshi

రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్

కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులను పోలీసులు మేజిస్ట్రేట్లో హాజరుపరిచారు.

వరంగల్: కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాజయ్య సహా భార్య, కుమారుడు అనిల్కు 14 రోజుల రిమాండ్ విధించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించిన అనంతరం వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు జరిపారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారని సీపీ చెప్పారు. అగ్నిప్రమాదం వల్లే సారిక, పిల్లలు మరణించారని, అయితే అది ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న విషయం విచారణలో మాత్రమే తేలుతుందని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement