ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో..
సాక్షి, కొరాపుట్ : ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో చంద్రికా హొంతాల్ అనే ఓ యువతిపై గోపీ ఖొరా అనే యువకుడు పెట్రోల్ పోసి, నిప్పంటించిన ఘటనలో బాధితురాలు భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఇదే విషయాన్ని సునాబెడ ఎస్డీపీఓ నిరంజన్ బెహరా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇదే ఘటనకు కారణమైన నిందిత యువకుడు కొరాపుట్ కోర్టులో లొంగిపోయాడు.
వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని నందపూర్ సమితిలో ఉన్న బంగల్గుడ గ్రామానికి చెందిన బాధితురాలు చంద్రిక హొంతాల్ సెమిలిగుడకు చేరువలో ఉన్న జనిగుడ శీతం ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా చదువుతుండేది. అప్పుడు తనతోటి విద్యార్థినులతో చంద్రిక ఓ అద్దె ఇంట్లో ఉండేది. ఆమె నివాసముంటున్న ఇంటికి దగ్గర్లోనే గోపీ ఖొరా కూడా ఉంటూ చంద్రికకు ప్రేమలేఖలు పంపుతుండేవాడు. అనంతరం ఆమె అంగీకారానికై ఎదురుచూసేవాడు. ఎంతకీ చంద్రిక అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆ యువకుడు గత నెల 31వ తేదీన చంద్రికను పిలిచి, హఠాత్తుగా ఆమెపై పెట్రోల్పోసి నిప్పంటించాడు. దీంతో చంద్రిక హాహాకారాలు విన్న స్థానికులు ఆమె వద్దకు చేరి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె శరీరంలో దాదాపు 80 శాతం కాలిపోయింది. ఈ క్రమంలో ఆమెను కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్కు తరలించారు. అనంతరం బరంపురం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగపడకపోవడంతో భువనేశ్వర్కు తరలించారు.