సంచలన గ్యాంగ్ రేప్ కేసు.. ఘోర తప్పిదం
తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్య సిబ్బంది
తర్వాత సరిదిద్దుకుని మరొకటి
భోపాల్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన భోపాల్ యువతి అత్యాచార కేసులో ఘోర తప్పిదం జరిగింది. యువతి ఇష్టపూర్వకంగానే నిందితులతో శృంగారంలో పాల్గొంది అంటూ మెడికల్ రిపోర్టు రావటం కలకలం రేపింది. దీంతో హడావుడిగా రంగంలోకి దిగిన అధికారులు అది పొరపాటున జరిగిందంటూ వివరణ ఇచ్చారు.
సుల్తానియా మహిళా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కరణ్ పీప్రె ఘటనపై మీడియాతో స్పందించారు. ‘‘ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది కొత్త వాళ్లు కావటంతో ఈ తప్పు దొర్లింది. తప్పును సరి చేసే కొత్త నివేదికను విడుదల చేశాం’’ అని పీప్రె తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని.. సున్నితమైన కేసుల్లో సీనియర్ మహిళ వైద్యురాలి పర్యవేక్షణ తప్పనిసరి చేసినట్లు ఆయన చెప్పారు. నివేదిక తయారీలో ఏవైనా ఒత్తిడులు వస్తున్నాయా? అన్న ప్రశ్నకు... వైద్య విభాగంలో ఎలాంటి ఒత్తిళ్లు పని చేయవని ఆయన సమాధానమిచ్చారు.
కాగా, గత వారం సివిల్స్ ఎగ్జామ్ కోసం కోచింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతి లాక్కెల్లి కొందరు వ్యక్తులు హబీబ్గంజ్ ప్రాంతంలో అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జోక్యంతో ఆ సిబ్బందిపై వేటు పడింది. అరెస్టయిన నలుగురు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇక బాధితురాలికి నగరంలోని సుల్తానియా మహిళా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. తప్పుడు ప్రాథమిక నివేదిక సమర్పించి ఈసారి వైద్యాధికారులు విమర్శలపాలయ్యారు.
ఇది కూడా చదవండి... నగరం నడిబొడ్డున మృగాళ్ల పాశవికం