భర్త మరణించాడని..

Wife Suicide After Husband Deaths In Prakasam - Sakshi

ఒంగోలు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అది కూడా భర్త అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే. ఈ సంఘటన ఒంగోలు మండలం ఉలిచిలో వెలుగు చూసింది. ఈ నెల 6న ఉలిచికి చెందిన చోడవరపు అశోక్‌ తన స్నేహితుని ఫంక్షన్‌ ఉందంటూ వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న అమ్మనబ్రోలు–కరువది రైల్వేస్టేషన్ల మధ్య అశోక్‌ మృతదేహం వెలుగు చూసింది. రైలు నుంచి జారిపడి ఉంటాడని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న బంధువులు గుర్తించి రైల్వే పోలీసులను ఆశ్రయించారు.  అదేరోజు అశోక్‌ మృతదేహానికి అంత్యక్రియలు ముగించారు. భార్య సుప్రియ ప్రస్తుతం నాలుగో నెల గర్భిణి.

ఆమె గురువారం రాత్రికి తన నాయనమ్మ వద్ద పడుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నాయనమ్మ లేని చూస్తే సుప్రియ కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరేసుకొని కనిపించింది. ఆమె పెద్దగా కేకలు వేయగా కుటుంబ సభ్యులు లేచి ఉరినుంచి తప్పించి రిమ్స్‌కు తరలించారు. డాక్టర్లు అప్పటికే సుప్రియ (20) మృతిచెందిందని నిర్థారించారు. మృతురాలి పుట్టిల్లు అనుబ్రోలువారిపాలెం. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు పులికొండలో స్థిరపడ్డారు. భర్త మరణాన్ని తట్టుకోలేక, భర్తలేని జీవితం వ్యర్థం.. అని ఆత్మహత్యచేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top