‘మీ నాన్నను చంపేశాను’

Wife Attacked Her Husband With Axe In Rangareddy - Sakshi

సాక్షి, పూడూరు: మతిస్థితిమితం కోల్పోయిన ఓ మహిళ తాను కట్టుకున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన మంగళి యాదమ్మ, వెంకటయ్య(60) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉండగా వారి వివాహం జరిగింది. యాదమ్మ, వెంకటయ్య గ్రామంలో వేరుగా నివాసముంటున్నారు. అయితే, మూడేళ్లుగా యాదమ్మ మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోందని కుటుంబీకులు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు.

కొంతకాలంగా యాదమ్మ మాత్రలు వాడుతోంది. అయితే, గత 15 రోజులగా వినియోగించడం లేదు. ఇదిలా ఉండగా, బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో యాదమ్మ తన భర్త వెంకటయ్య మెడపై గొడ్డలితో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రక్తం మరకలు నీటితో కడిగేసింది. ఆ తర్వాత గ్రామంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లిన యాదమ్మ ‘మీ నాన్నను చంపేశాను’ అని తెలిపింది. దీంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పరిగి సీఐ మొగులయ్య సందర్శించి వివరాలు సేకరించారు. తానే గొడ్డలితో నరికి చంపినట్లు యాదమ్మ పోలీసులకు చెప్పింది. అయితే, నిందితురాలు భర్త హత్య అనంతరం రక్తం మరకలను శుభ్రం చేయడంతో ఆమెకు మతిస్థిమితం లేకపోవచ్చని సీఐ మొగులయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మృతుడి కుమారుడు మంగళి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top