వితంతువు పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె ముందే..

Widow Refuses to Marry Him, Man Shoots Himself in Front of Her - Sakshi

భోపాల్‌ : వితంతువు పెళ్లికి నిరాకరించిందని ఆమె ముందే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడో యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసముండే ఓ మహిళ, భర్త చనిపోవడంతో తన కూతురితో అత్తమామల వద్ద ఉంటోంది. చిన్న వయసులోనే కొడుకు చనిపోవడంతో కోడలికి మరో పెళ్లి చేయాలని అత్తామామలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఛత్తార్‌పూర్‌కి చెందిన జితేంద్ర అనే యువకుడు ఆమెను ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడేవాడు. కానీ ఆమెకు ఇష్టం లేకపోవడంతో అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. తిరస్కారాన్ని తట్టుకోలేకపోయిన జితేంద్ర ఆఖరుసారిగా అడిగి చూద్దామని శనివారం ఉదయం ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్లి మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.

అయితే ఎప్పటిలాగే ఆమె తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన జితేంద్ర తన వద్దనున్న తుపాకితో కణతకు గురిపెట్టి కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకి శబ్దం విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి జితేంద్ర విగత జీవిగా పడిఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.అనంతరం స్థానికుల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వితంతు మహిళకు మాత్రం ఎలాంటి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు. కాగా, యువకుడి వన్‌ సైడ్‌ లవ్వే ఈ ఘటనకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top