మృత్యువులోనూ వీడని స్నేహం

Two Friends Died In Road Accident - Sakshi

భాకరాపేట : వారిద్దరూ మంచి స్నేహితులు. చిన్ననాటి నుంచి బడికి వెళ్లినా, ఆటలాడడానికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ఇద్దరి పేర్లూ ఒక్కటే. రోడ్డు ప్రమాదంలో ఆ  ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చిన్నగొట్టిగల్లులో చోటుచేసుకుంది. భాకరాపేట ఎస్‌ఐ పరశురాముడు కథనం..  చిన్నగొట్టిగల్లుకు చెందిన అంగజాల నాగరాజ కుమారుడు యశ్వంత్‌ (25), కోడిపుంజల వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (24) భాకరాపేట నుంచి స్వగ్రామానికి మోటార్‌ సైకిల్‌లో బయలుదేరారు. రెండు మూడు నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకునే సమయానికి మృత్యువు వారిని ట్రాక్టర్‌ రూపంలో కబళించింది.

చిన్నగొట్టిగల్లు చెరువు మొరవ సమీపంలో లారీ నుంచి ట్రాక్టర్‌లోకి సైలేజ్‌ గడ్డి దింపుకుని యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో ఎలాంటి సిగ్నల్స్‌ ఇవ్వపోవడం..పైగా రాత్రి కావడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న యువకులు ఇది గుర్తించకుండా ట్రాక్టరు ట్రాలీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిని భాకరాపేట 108లో పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. భాకరాపేట ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నగొట్టిగల్లులో విషాద ఛాయలు
ఇద్దరు స్నేహితుల మృతితో చిన్నగొట్టిగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రం వరకు కూడా వీధుల్లో ఇద్దరూ బండ్లో తిరుగుతుంటే చూస్తిమి కదరా! ఇంతలోనే ఇట్లా జరిగిందేమిరా? అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top