పాముకాటుతో బాలుడు మృతి

Three Years Baby Boy Deceased With Snake Bite in Rangareddy - Sakshi

నందిగామ: ఇంటి ముందు వరండాలో ఆడుకుంటున్న ఓ బాలుడిని పాము కాటేయడంతో మృతిచెందాడు. నందిగామ పంచాయతీ పృథ్వీకాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బాలుడి తండ్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బుద్ధాదేవ్‌ ప్రధాన్‌ కొన్నేళ్ల క్రితం నందిగామకు కుటుంబంతో వలస వచ్చాడు. పృథ్వీ కాలనీలో నివాసం ఉంటూ పక్కన్నే ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బుద్ధాదేవ్‌ ప్రధాన్‌ కుమారుడు అధర్వ్‌ ప్రధాన్‌(3) ఇంటి వరండాలో ఆడుకుంటుండగా గేటులోనుంచి వచ్చిన పాము బాలుడి కాలుపై కాటు వేసింది. బాలుడు అరుస్తుండగా వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు పరుగెత్తుకొని వచ్చి చూసే సరికి పాము చెట్ల పొదళ్లలోకి వెళ్లి పోయింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాలుడి తండ్రి బుద్ధాదేవ్‌ ప్రధాన్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం స్వరాష్ట్రానికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top