పురుగుమందు తాగి యువతి ఆత్మహత్య

Teenage Girl Commits Suicide in Mahabubnagar - Sakshi

కేటీదొడ్డి (గద్వాల): పురుగుల మందుతాగి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇన్‌చార్జి ఏఎస్‌ఐ రాజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మైలగడ్డకు చెందిన పారిజాతమ్మ, జనార్దన్‌ దంపతుల కూతురు రవళి (17) గద్వాల కొట్టం మాణిక్యమ్మ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన సమీప బంధువు గద్వాల శివను రెండేళ్లుగా ప్రేమిస్తోంది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియగా పంచాయితీ పెట్టి పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు.

అప్పటి నుంచి ఇద్దరు తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఏం జరిగిందో తెలియదు. బుధవారం రవళి తల్లిదండ్రులు ఓ శుభకార్యం నిమిత్తం పక్క  గ్రామానికి వెళ్లగా శివ ఇంటివద్దకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో  క్షణికావేశానికి లోనైన యువతి సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన చుట్టు పక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, హుటాహుటిన రవళిని గద్వాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. తండ్రి జనార్దన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ  రాజేందర్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యలను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top