పిడి బాకుతో వెంటాడిన కౌన్సిలర్‌ కుమారుడు

tdp counciler son attempt to murder on ysrcp Activist - Sakshi

టూ టౌన్‌లో బాధితుడి ఫిర్యాదు

ప్రొద్దుటూరు క్రైం : అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ కుమారుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తను చంపేందుకు పిడి బాకు తీసుకొని వెంటాడిన సంఘటన ఆదర్శ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదర్శకాలనీకి చెందిన తిరుపాలు కూలి పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు వీధిలో చాలా మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఉన్న మనస్పర్థలను సాకుగా చూపి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ కాకి తిరుపతమ్మ కుమారుడు సురేంద్ర వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో గొడవ పెట్టుకునేవాడు. తిరుపాలు, ప్రసాద్, పెంచలయ్యతో పాటు కొందరు యువకులు దారిలో నిల్చొని  ఉన్నా ‘  నేను వస్తుంటే మీరు వెళ్లి పోవాలి.. లేదంటే చంపేస్తాను’ అని వారిని బూతులు తిడుతూ బెదిరించేవాడు.

కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31 రాత్రి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా సురేంద్ర అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే   పిడి బాకు తీసి అతను చంపుతానని బెదిరించాడన్నారు. పండుగ రోజు కావడంతో ఆ రోజు వారు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. అప్పటి నుంచి వీరు భయ పడుతూ తిరిగే వారు. ఈ క్రమంలో మంగళవారం ఆదర్శకాలనీ సమీపంలోని గవిని దగ్గర ఉండగా సురేంద్ర అక్కడికి వచ్చి ‘ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావ్‌.. ఈ రోజు దొరికావు చంపుతాను ’ అంటూ తన వద్ద ఉన్న పిడి బాకు తీసి పొడవడానికి ప్రయత్నించగా తిరుపాలు ప్రాణ భయంతో పరుగులు తీశాడు. అయినా అతను కొంత దూరం వెంబడించాడు. తమను టార్గెట్‌ చేసి చంపేందుకు కాచుకొని ఉన్న కాకి సురేంద్రపై తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని తిరుపాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టు టౌన్‌  పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top