20 ఏళ్లు చిన్నదైనా కన్నేసి.. కడతేర్చాడు | Sakshi
Sakshi News home page

కన్నేసి.. కడతేర్చాడు

Published Sat, Mar 2 2019 1:19 PM

Sri Jyothi Murder Case Accused Arrest in Guntur - Sakshi

గుంటూరు, తెనాలిరూరల్‌:  సంచలనం సృష్టించిన బిట్రా శ్రీజ్యోతి దారుణ హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని కోర్టుకు తరలించేముందు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మరీదు శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివశిస్తున్న మృతురాలు శ్రీజ్యోతి కుటుంబానికి సన్నిహితుడైన నేతికుంట్ల సత్యనారాయణ (40) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతను శ్రీజ్యోతిని వివాహం చేసుకోవాలని భావించాడు.

రెండు సార్లు ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించగా, వారు వారించారు. గత నెల 21వ తేదీన వివాహ సంబంధం మాట్లాడుకునేందుకు  ఏలూరు వెళ్లిన యువతి తల్లిదండ్రులకు వరుడు నచ్చడంతో, సంబంధం దాదాపు ఖరారైనట్టేనని తండ్రి సుధాకర్‌ తనకు మిత్రుడైన సత్యనారాయణకు చెప్పాడు. తాను వివాహం చేసుకుందామనుకున్న  యువతి తనకు దక్కకుండా పోతుందని కక్ష కట్టిన సత్యనారాయణ.. శ్రీజ్యోతి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న ఆమెపై చాకుతో దాడి చేశాడు. గొంతులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. కాగా, నిందితుడు వేద టాకీస్‌ పక్క సందులోని అతని మామయ్య ఇంట్లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. సత్యనారాయణను కోర్టులో హాజరు పరచగా  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

1/1

మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు, పక్కన ఎస్‌ఐ అనిల్‌కుమార్, ముసుగులో నిందితుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement