స్పైస్‌జెట్ ఉద్యోగిపై ముసుగు దొంగల బీభత్సం

SpiceJet Pilot Robbed At Gunpoint, Left Bleeding Near IIT Delhi - Sakshi

తుపాకితో బెదిరించి దోచుకున్న దుండగులు

కత్తులు, రాడ్లతో దాడి; కారు ధ్వంసం

గాయపడిన పైలట్ యువరాజ్ తెవాతియా 

సాక్షి, న్యూఢిల్లీ : విధులకు హాజరవుతున్న పైలట్‌ను తుపాకితో బెదిరించి దోచుకున్న వైనం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.  ఢిల్లీలోని ఐఐటీ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌ వద్ద గురువారం తెల్లవారుజామున  జరిగిన ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. కరోనా వైరస్, లాక్‌డౌన్  సందర్భంగా అత్యవసర సేవల్లో  వున్న  సిబ్బందిపై ఇదే  ప్రాంతంలో వరుస దోపిడీ ఘటనలు నమోదైనట్టు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్ విమాయాన సంస్థలో పనిచేసే పైలట్‌ యువరాజ్ సింగ్ తెవాతియా(30) ఫరీదాబాద్ నుంచి ఆఫీసు క్యాబ్‌లో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన సుమారు పదిమంది దుండగులు అడ్డుకున్నారు. తుపాకీతో బెదిరించి యువరాజ్ పర్సులోని సొమ్మును, ఇతర వస్తువులను దోచుకున్నారు. మరింత కావాలని డిమాండ్ చేస్తూ రాడ్లతో దాడికి  దిగారు. కారు అద్దాలను పగలగొట్టి, కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో పైలట్ స్వల్పంగా గాయపడగా, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవేందర్ ఆర్య తెలిపారు. సీసీటీవీ  ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top