యాసీన్‌ భత్కల్‌కు ఎదురుదెబ్బ!

Special Court Against To Yasin Bathkal In Banglore Stadium Blasts - Sakshi

హైదరాబాద్‌ పేలుళ్లలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది  

‘బెంగళూరు స్టేడియం’ కేసులోనూ శిక్షకు అవకాశం

ముగ్గురు అనుచరులను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు

సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) కో–ఫౌండర్‌ యాసీన్‌ భత్కల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన ఇతడికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసులోనూ శిక్షకు ‘మార్గం సుగమమైంది’. యాసీన్‌ అనుచరులు, ఆ కేసులో సహ నిందితులైన ముగ్గురిని దోషులుగా తేలుస్తూ అక్కడి ప్రత్యేక కోర్టు గత వా రం తీర్పు ఇచ్చింది. దీంతో యాసీన్‌కూ శిక్ష తప్ప దని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులతో పాటు అహ్మదాబా ద్, ఢిల్లీ, పుణే, వారణాసి విధ్వంసాలకు సూత్ర« దారిగా ఉన్న ఇతను ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నాడు. 

2010లో స్టేడియం బ్లాస్ట్‌...
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో 2010 ఏప్రిల్‌ 17న జరిగిన పేలుళ్లలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో ఈ స్టేడియాన్ని టార్గెట్‌ చేసిన ఐఎం విధ్వంసానికి దిగింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన అధికారులు కర్ణాటకలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌ భత్కల్‌ల ఆదేశాల మేరకు వారి సమీప బంధువు యాసీన్‌ నేతృత్వంలో పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు 2011 నవంబర్‌లో ఖతీల్, ఖఫీల్‌ అక్తర్, ఎజాజ్, హసన్‌ తదితరులను అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైల్లో ఉంచింది. వీరి విచారణ నేపథ్యంలో బెంగళూరుకు 60 కిమీ దూరంలో ఉన్న టుమ్కూరులో మొత్తం ఐదు బాంబులను తయారు చేశామని, ఆ ఏడాది ఏప్రిల్‌ 16 అర్థరాత్రి యాసీన్‌తో పాటు ఖతీల్‌ వీటిని స్టేడియం చుట్టూ పెట్టారని వెల్లడించారు. 

మిగిలిన వారిపై అభియోగాలు...
యాసీన్‌ భత్కల్‌ 2008లో జరిగిన అహ్మదాబాద్‌ పేలుళ్ల తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి ఆచూకీ లేని కారణంగా బెంగళూరు పోలీసులు యాసీన్‌ మినహా మిగిలిన నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. 2011 వరకు భారత్‌లోనే ఉండి ‘ఆపరేషన్స్‌’ చేపట్టిన యాసీన్‌ ఆపై దేశం దాటేశాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్ళకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాప్‌ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆప రేషన్‌. మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ‘యాసీన్‌ అండ్‌ కో’ చిరవకు 2013 ఆగస్టులో పట్టుబడ్డారు. దీంతో యాసీన్‌పై బెంగళూరు పోలీసులు చిన్నస్వామి స్టేడియం పేలుళ్లకు సంబం«ధించి వేరుగా అభియో గపత్రం దాఖలు చేశారు. ఇతడిపై హైదరాబాద్‌ కేసులో నేరం నిరూపణై ఉరి శిక్ష కూడా పడింది. 

వేరుగా అభియోగపత్రం దాఖలు...
ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్‌ తదితరులను తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్‌ భత్కల్‌ను తీహార్‌ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్‌మెంట్‌) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్‌ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగింది. దీంతో యాసీన్‌పై మరో అభియోగపత్రం దాఖలు చేశారు. ఇది విచారణలో ఉండగానే గత వారం న్యాయస్థానం మిగిలిని నిందితుల్ని దోషులుగా తేల్చింది.

ఖతీల్‌ 2012లో జైల్లోనే హత్యకు గురికాగా.. మిగిలిన ఖఫీల్, ఎజాజ్, హసన్‌లకు ఏడేళ్ళ చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, విచారణ ఎదుర్కొంటున్న యాసీన్‌ను శిక్ష తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఇతడిపై ఉన్న మిగతా కేసుల విచారణ సైతం పూర్తయి, ఇతర ఫార్మాలిటీస్‌ పూర్తయిన తర్వాత మాత్రమే హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్ష అమలుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top