ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని హతమార్చిన తర్వాత కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. వివరాలు...రెండేళ్ల క్రితం వెంకటేశ్వరన్ గోపాల్ అయ్యర్(42) అనే వ్యక్తి తల్లి(75)తో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. మీరారోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం అతడి ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో అయ్యర్ ఫ్లాట్కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. రక్తపు మడుగులో అతడి తల్లి మృతదేహం పడి ఉండగా.. బెడ్రూంలో అయ్యర్ శవం కనిపించింది. ఈ క్రమంలో అతడి ల్యాప్టాప్లో సూసైడ్ నోట్ లభించింది. దీని ఆధారంగా మొదట తల్లిని చంపిన తర్వాత అయ్యర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జంట మరణాలకు గల కారణాలు అన్వేషిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.