వ్యభిచారం ముసుగులో దోపిడీ | Robbery Gang Arrest in PSR Nellore | Sakshi
Sakshi News home page

వ్యభిచారం ముసుగులో దోపిడీ

Nov 9 2018 12:02 PM | Updated on Nov 9 2018 12:02 PM

Robbery Gang Arrest in PSR Nellore - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ నరసింహారావు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ఉంగరం

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): వ్యభిచారం ముసుగులో వ్యక్తులపై దాడిచేసి నగదు, బంగారం దోపిడీ చేస్తున్న ముఠాను నెల్లూరు వేదాయపాళెం (ఐదవ నగర) పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. సీఐ కె.నరసింహారావు గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒక ఆటో డ్రైవర్, ఇద్దరు మహిళలు ముఠాగా ఏర్పడి వ్యభిచారం పేరుతో పురుషులను ఆకర్షిస్తున్నారు. తమతో వచ్చినవారిని ఆటోలో శివారు ప్రాంతాలకు, నిర్జీవ స్థలాలకు తీసుకువెళ్లి దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు దోచుకుంటున్నారు. ఈనెల 1వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో గూడూరు మండలం దివిపాళెంకు చెందిన పిన్ని వెంకట శ్రీనివాసులు అనే వ్యక్తి నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద ఆటో ఎక్కాడు. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌ శ్రీనివాసులను చంద్రబాబునగర్‌ ప్రాంతంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.10 వేల నగదు, బంగారు ఉంగరం, ఒక సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. దీనిపై వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందింది. దీంతో ముఠాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు.

పారిపోయేందుకు ప్రయత్నించగా..
ఈ క్రమంలో బుధవారం రాత్రి వేదాయపాళెం పోలీసుస్టేషన్‌ పరిధిలో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. వేదాయపాళెం సెంటర్‌ వద్ద అనుమానాస్పదంగా వెళుతున్న ఏపీ 26 టీఏ 4750 నంబర్‌ ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా అందులో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరు మహిళలు వాహనంలో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. 1వ తేదీన ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద ఆటోలో ఎక్కిన వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసినట్లు వారు అంగీకరించారు. నిందితులు చంద్రబాబునగర్‌ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కొంగ శ్రీనివాసులు, అదే ప్రాంతానికి చెందిన మెక్కల సరళ, వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన విడవలూరు మున్నీలుగా గుర్తించారు. వారిపై కేసు నమెదుచేసి ఒక బంగారు ఉంగరం, రూ.3 వేల నగదు, సెల్‌ఫోన్, దోపిడీకి ఉపయెగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. డ్రైవర్‌ కొంగ శ్రీనివాసులపై ఇప్పటికే నెల్లూరు రూరల్, సంతపేట పోలీస్‌స్టేషన్‌లో దారి దోపిడీకి సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు చెప్పారు. అతడిని పట్టుకునేందుకు రూరల్‌ సీఐ వి.శ్రీనివాసులురెడ్డి సహకరించాడని తెలిపారు. ఈ ముఠాను పట్టుకునేందుకు చొరవ చూపిన వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిపార్సు చేస్తామని సీఐవెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement