నమ్మించి చంపేశారు!

Priyanka Reddy Brutally Murdered And Burnt At Shadnagar Hyderabad - Sakshi

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా తొండుపల్లి వద్ద కిడ్నాప్‌ 

షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి వద్ద కాలిపోయిన స్థితిలో మృతదేహం 

అత్యాచారం, ఆపై హత్య చేసి ఉంటారని అనుమానం 

భయంగా ఉందంటూ చెల్లెలికి చివరి ఫోన్‌ కాల్‌ 

శంషాబాద్, షాద్‌నగర్‌ టౌన్, షాద్‌నగర్‌ రూరల్‌: స్కూటీ టైర్‌ పంక్చర్‌ అతికిస్తామంటూ నమ్మించి ఓ యువతిని హత్య చేసి, ఆ తర్వాత పెట్రోల్‌ పోసి తగులబెట్టిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అదృశ్యమై షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద శవమై కనిపించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి, విజయమ్మకు ఇద్దరు కూతుళ్లు. శ్రీధర్‌రెడ్డి పీఏసీఎస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు ప్రియాంకారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తోంది. రెండో కూతురు భవ్య శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఉద్యోగి.

వీరి కుటుంబం నాలుగేళ్లుగా శంషాబాద్‌లో నివాసముంటోంది. బుధవారం కొల్లూరులో విధులు ముగించుకున్న ప్రియాంక.. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. ముఖంపై ఏర్పడిన మచ్చలకు చికిత్స కోసం ఇంటి నుంచి స్కూటీపై సాయంత్రం 6 గంటలకు బయల్దేరింది. స్కూటీని తొండుపల్లి వద్ద ఉన్న టోల్‌ ప్లాజాకు కొద్ది దూరంలో ఆపి అక్కడి నుంచి మరో వాహనంలో గచ్చిబౌలిలోని ఓ క్లినిక్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే స్కూటీ పంక్చర్‌ అయినట్లు గుర్తించింది. 

పంక్చర్‌ వేయిస్తామంటూ.. 
స్కూటీ పంక్చర్‌ అతికించి ఇస్తామంటూ అక్కడే ఉన్న ఓ 20 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ప్రియాంక స్కూటీ తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి.. పంక్చర్‌ అతికించేవారు లేరని, మరో చోటుకు తీసుకెళ్తానని ప్రియాంకకు చెప్పాడు. అందుకు ఆమె అడ్డుచెబుతూ.. ముందుకు వెళ్లి తానే ఎక్కడైనా పంక్చర్‌ అతికించుకుంటానని చెప్పినా ఆ వ్యక్తి వినకుండా మధ్యలోనే స్కూటీ ఆగిపోతుందని చెప్పి పంక్చర్‌ అతికించేందుకు మరో చోటుకు తీసుకెళ్లాడు. 

భయమేస్తుందంటూ చెల్లికి ఫోన్‌.. 
‘స్కూటీ పంక్చర్‌ అయ్యింది.. బాగుచేసుకొస్తానని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. పక్కన లారీలో ఎవరో ఉన్నారు. నాకు భయంగా ఉంది’అంటూ ప్రియాంక తన చెల్లెలికి రాత్రి 9.22 గంటల సమయంలో ఫోన్‌ చేసి చెప్పింది. చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, వారిని చూస్తే భయమేస్తోందని, అంతా తననే చూస్తున్నారంటూ వివరించింది. ఒంటరిగా ఉన్నానని, కొద్దిసేపు మాట్లాడాలంటూ సోదరిని కోరింది. ఇలా సుమారు 6 నిమిషాల పాటు ప్రియాంక తన చెల్లెలితో ఫోన్‌లో సంభాషించింది. ఆ తర్వాత ప్రియాంక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. 

చదవండి: 

ప్రియాంక హత్య కేసు; నిందితుల్లో ఒకడిది లవ్‌మ్యారేజ్‌

లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు

నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి

నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి

 వీడిన ప్రియాంక మర్డర్‌ మిస్టరీ.. రాత్రంతా..

ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పురోగతి

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !


సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు  

చటాన్‌పల్లిలో శవమై.. 
గురువారం తెల్లవారుజామున షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి వద్ద మంటలను చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే బుధవారం రాత్రి చెల్లెలితో మాట్లాడే సమయంలో ప్రియాంక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిన తర్వాత రాత్రి 11 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ప్రియాంక అదృశ్యం కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం షాద్‌నగర్‌లో మహిళ హత్య జరిగిన సంఘటన వెలుగుచూడటంతో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్న ప్రియాంక మెడలో ఉన్న బంగారు లాకెట్‌ ఆధారంగా ఆమెను పోలీసులుగుర్తుపట్టారు. 

ఎన్నో అనుమానాలు.. 
ప్రియాంకను వేరే ప్రాంతంలో హత్య చేసి చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్లు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారా.. ఆమె ప్రతిఘటించడంతోనే హత్య చేసి నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి సుమారు 9.30 సమయంలో ప్రియాంకరెడ్డి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయ్యింది. ఆ తర్వాతే ఆమెను దుండగులు కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దుండగులు ప్రియాంకరెడ్డిని ఏడు గంటల పాటు తమ వద్ద ఉంచుకొని ఆ తర్వాత దారుణానికి ఒడిగటినట్లు తెలుస్తోంది. ప్రియాంకరెడ్డి కిడ్నాప్‌ అయిన ప్రాంతానికి, ఆమె మృతదేహం ఉన్న ప్రాంతానికి మధ్య సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రియాంకరెడ్డిని బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్‌ చేసిన దుండగులు గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారన్నది తెలియాల్సి ఉంది. కాగా, ప్రియాంక మృతదేహానికి వైద్యులు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. 

కదలికలను గమనించిన వారే.. 
ప్రియాంకరెడ్డి తరచూ గచ్చిబౌలికి వెళ్లి వచ్చే సమయంలో టోల్‌గేట్‌ బూత్‌ సమీపంలోనే స్కూటీ నిలిపేది. బుధవారం సాయంత్రం మాత్రం టోల్‌గేట్‌ సిబ్బంది అక్కడ స్కూటీ పెట్టొద్దనడంతో పక్కనే ఉన్న ఔటర్‌ సర్వీసు రోడ్డు సమీపంలో పెట్టి వెళ్లింది. రోజూ ఆమె కదలికలను గమనిస్తున్న వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా.. లేదా లారీల డ్రైవర్లు పథకం ప్రకారమే ఇలా చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వీసు రహదారి వైపు సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ లారీ పార్కింగ్‌ చేసిన వారు ఎవరై ఉంటారనేది తెలియలేదు. ప్రియాంక అత్యాచారానికి గురైందని అనుమానిస్తున్న స్థలం టోల్‌ప్లాజాకు 60 మీటర్ల దూరంలో ఉంది. రాళ్లగూడ వైపు వెళ్లే సర్వీసు రహదారికి అరవై మీటర్ల దూరంలోనే ప్రహరీ ఉన్న అర ఎకరం స్థలంలోని ఓ ప్రహరీలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. 

చెల్లి మాట విని ఉంటే.. 
తన చెల్లెలు ఫోన్‌లో చెప్పినట్లు ప్రియాంక విని ఉంటే ప్రాణాలు దక్కేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద నిలబడి ఉంటే ఈ దారుణం జరిగి ఉండకపోవచ్చని చెబుతున్నారు. వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంటే బాగుండేదని పోలీసులు కూడా పేర్కొంటున్నారు. 

స్కూటీ గుర్తింపు.. 

ప్రియాంకరెడ్డి స్కూటీని పోలీసులు షాద్‌నగర్‌ సమీపంలోని కొత్తూరులో గురువారం రాత్రి గుర్తించారు. అయితే దుండగులు స్కూటీ నంబర్‌ ప్లేటు తీసేసి దర్గా రోడ్డులో నాట్కో పరిశ్రమ సమీపంలో వదిలి వెళ్లారు. అయితే హత్య జరగడానికి ముందే ఇక్కడ వాహనాన్ని వదిలి వెళ్లారా లేదా ముందుగానే వదిలి వెళ్లారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు? 
ప్రియాంకను హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలోని అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించట్లేదు. ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్‌ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారని, ఆ సమయంలో వీరిద్దరి ఫోన్‌ కాల్స్‌ గుర్తించినట్లు, వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. 

 

ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు..
జీన్స్‌ ప్యాంటు టీ షర్ట్‌ వేసుకున్న 20 ఏళ్ల యువకుడు ఎర్రరంగు స్కూటీ తీసుకుని ఇక్కడికి వచ్చాడు. బండి పంక్చర్‌ అయిందని చెప్పాడు. కానీ బండిలో గాలి మాత్రమే నింపించుకున్నడు. తిరిగి శంషాబాద్‌ వైపే తీసుకెళ్లాడు. అతడితో పాటు ఎవరూ కనిపించలేదు.  – శంషీర్, బండిలో గాలి నింపిన వ్యక్తి 

మంటల్లో కాలిపోతుంటే చూశా.. 
ఉదయం 5 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నా. ఆ సమయంలో మార్గమధ్యలో ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జి కింద మంట మండుతున్న విషయాన్ని గమనించాను. పొలానికి వెళ్లి తిరిగి 6 గంటలకు వస్తున్నా. బ్రిడ్జి కింద మంటల్లో ఓ మనిషి కాలుపోతున్న విషయాన్ని గుర్తించాను. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను.  – సత్యం, లింగారెడ్డిగూడ, షాద్‌నగర్‌

లారీ డ్రైవర్లే హతమార్చారు 
లారీ డ్రైవర్లు అందరూ తననే చూస్తున్నారని, భయంగా ఉందంటూ చెల్లెలికి ఫోన్‌లో చెప్పింది. కొద్ది సేపటి తర్వాత ప్రియాంకా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. నా కూతురిని లారీ డ్రైవర్లే హత మార్చి ఉంటారు.
– శ్రీధర్‌రెడ్డి, మృతురాలి తండ్రి 

ప్రియాంకారెడ్డి హత్యకు ముందు.. 
► మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొల్లూరు నుంచి శంషాబాద్‌కు వచ్చింది. 
► సాయంత్రం 4 గంటలకు శంషాబాద్‌లోని ఇంటికి చేరుకుంది. 
► సాయంత్రం 5.45 గంటలకు ఇంటి నుంచి గచ్చిబౌలికి వెళ్లడానికి స్కూటీపై బయల్దేరింది. 
► సాయంత్రం 6 గంటలకు తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో స్కూటీ నిలిపి గచ్చిబౌలి హాస్పిటల్‌కు వెళ్లింది. 
► రాత్రి 9.10 గంటల సమయంలో క్యాబ్‌లో తిరిగి తొండుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. 
► 9.15 గంటల సమయంలో స్కూటీ తీస్తుండగా పంక్చర్‌ అయిందని గుర్తు తెలియని వ్యక్తులు బండి తీసుకెళ్లారు. 
► 9.22 గంటల సమయంలో బైక్‌ తీసుకెళ్లిన వారి గురించి వారి చెల్లెలితో మాట్లాడింది. 
► 9.30 గంటల తర్వాత ప్రియాంక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. 
► 9.30 నుంచి 10 గంటల సమయంలోనే ఆమె అత్యాచారానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

చెల్లితో ప్రియాంక సంభాషణ.. 

ప్రియాంక: పోయావా ఆఫీసుకి.. 
చెల్లి: వెళ్లాను.. 
ప్రియాంక: సరే నాది ఇప్పుడు అయిపోయింది. వచ్చిన ఇప్పుడే. కొద్దిసేపు నాతో మాట్లాడు.. 
చెల్లి: ఎందుకు ఏమైంది.. 
ప్రియాంక: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు నీకు తర్వాత చెప్తా. 
చెల్లి: ఏమైంది అక్కడేమైనా యాక్సిడెంట్‌ అయ్యిందా.. గచ్చిబౌలిలో యాక్సిడెంట్‌ అయ్యిందా. 
ప్రియాంక: అర్థం కాలేదు 
చెల్లి: యాక్సిడెంట్‌ అయ్యిందా  
ప్రియాంక: లేదు నాకు చాలా టెన్షన్‌గా ఉంది. 
ప్రియాంక: అక్కడ టోల్‌ గేటు దగ్గర బైక్‌ పెడత కదా.. అక్కడ పెట్టకూడదు పోలీసులు తీసుకుపోతున్నరని టోల్‌గేటు ఆయన చెప్పిండు.. ఇక్కడ ఔటర్‌ రింగుకు ఇంకో దారిలో పెట్టా.. ఇప్పుడే వచ్చాను స్కూటీ పంక్చర్‌ అయింది. 
చెల్లి: సరే వదిలేసి రా.. ఇంకేంటి 
ప్రియాంక: వదిలేస్తే రేపు పొద్దున ఎవరు తీసుకొస్తరే.. 
చెల్లి: మెకానిక్‌ను తీసుకెళ్లి తేవాలి. 
ప్రియాంక: మెకానిక్‌నా.. కొంచెం దూరం కూడా పోదానే.. పంక్చరైంది వెనుక టైరు. 
చెల్లి: ఏమో నాకు తెలీదే. 
ప్రియాంక: అయితే, చెప్తా విను.. ఇక్కడ ఓ లారీ ఉందే.. అందులో జనాలున్నరు. అందులో ఒకాయన చేపిచ్చుకొస్తా అని తీసుకెళ్లిండు. 
చెల్లి: తీసుకురాలేదా.. 
ప్రియాంక: తీసుకొచ్చిండు.. అది క్లోజ్‌ ఉంది. మళ్లీ ఇంకోషాప్‌లో చేసుకొస్తానని చెప్పి తీసుకు పోయిండు. నాకు భయమైతుంది పాపా.. 
చెల్లి: అక్కడ ఎవరు లేరా..  
ప్రియాంక: వెహికిల్స్‌ ఉంటవి చూడు అక్కడ.. టోల్‌ అది ఉంటది చూడు.. నేను పోతా అంటే వాళ్లు వద్దు ఉండు అని అంటున్నా దయ్యాల్లాగా నిలబడిన్రు. 
చెల్లి: టోల్‌గేటు ఉంటది కదా అక్కడికి వెళ్లి నిలబడు. 
ప్రియాంక: మాట్లాడు నాకు భయమైతుంది. 
చెల్లి: టోల్‌గేటు కాడికి వెళ్లు. 
ప్రియాంక: వాళ్లు బయటనే ఉన్నరు. 
చెల్లి: ఎవరు 
ప్రియాంక: లారీస్‌ వాళ్లు 
ప్రియాంక: వీళ్లేందే సడన్‌గా ఎవరూ కనిపించకుండా పోయిన్రు. లేదు.. ఉన్నరు. నేను బండి స్టార్ట్‌ చేసి పోతుంటే పంక్చర్‌ అయింది.. తగిలిన్రు. బస్టాండ్‌లో చేపిచ్చుకుంటా అంటే వినకుండా.. మేడం చేపిచ్చుకొస్తమని వెంటబడిన్రు. దయ్యాల్లాగా.. 
చెల్లి: టోల్‌గేటు వద్దకు వెళ్లు. 
ప్రియాంక: అక్కడ నిలబడితే అందరు చూసుకుంట పోతరు.. వచ్చేటోళ్లు.. పోయేటోళ్లు.. 
చెల్లి: చూడనీ.. అయితే ఏమైతది 
ప్రియాంక: కొంచెంసేపు మాట్లాడు.. భయమైతుంది.. బైకు వచ్చేవరకు అయిదు నిమిషాలు. 
చెల్లి: ఇంత లేటుగా పోవడం అవసరమా..రేపు పోకూడదా.. 
ప్రియాంక: లేటు కాదే తల్లి.. ఓ పనైపోయింది. రేపు మీటింగు ఉందన్నరు.. సండే.. మండే టెంపుల్‌కు తీసుకుపోతున్నరు. అసలు టైమే ఉండటం లేదు. 
చెల్లి: సరే కొద్దిసేపైన తర్వాత మాట్లాడుతా..  


ప్రియాంకారెడ్డి బైక్‌ పార్క్‌ చేసిన ఔటర్‌ రింగురోడ్డులోని తొండుపల్లి టోల్‌ప్లాజా ఇదే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top