న్యాయం చేయండి

Police Wrong Statement on Young Death in PSR Nellore - Sakshi

యువకుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు

పోలీసులు కేసును తప్పుదోవ పట్టిçస్తున్నారు

బాధిత కుటుంబసభ్యుల ఆరోపణ

పోలీసు అధికారుల హామీతో ఆందోళన విరమణ  

నెల్లూరు(క్రైమ్‌): ‘వాహనం ఢీకొని యువకుడు  మృతిచెందితే మూర్ఛ వ్యాధితో చనిపోయాడని పోలీసులు కేసును తప్పదోవ పట్టిస్తున్నారు. నిష్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలి’ అని మృతుడు నితిన్‌ కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశా రు. బుధవారం సాయంత్రం వారు నెల్లూరులోని బట్వాడిపాళెం సెంటర్‌లో మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. ఎస్పీ వచ్చి సమాధా నం చెప్పే వరకు కదలమని భీష్మించుకుని కూర్చుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మలు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి.

శివగిరికాలనీకి చెందిన పాలూరు శివయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకు నితిన్‌ (17) నగరంలోని ఓ ప్రైటేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదవుతున్నాడు. ఈనెల 10వ తేదీ పని ఉందని ఇంటినుంచి బయటకు వెళ్లిన నితిన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మూర్ఛతో కింద పడిపోవడంతో చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాధితులు పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన మహేంద్ర జైలో కారు ఢీకొనడంతో మృతిచెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల పరిశీలన చేపట్టారు. కొన్నిచోట్ల కెమెరాలు పనిచేయలేదని చెప్పడం, మిగిలిన ఫుటేజీలను పరిశీలించాల్సి ఉందని చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతోనే నితిన్‌ చనిపోయాడని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు.

బాధితులతో మాట్లాడిన పోలీసులు
బాధిత కుటుంబసభ్యులు బుధవారం సాయంత్రం మృతదేహంతో బట్వాడిపాలెం సెంటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుడి బంధువులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ వచ్చి నిష్పక్షపాతంగా విచారించి న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మీంచుకుని కూర్చోవడంతో సమస్య జఠిలంగా మారింది. రొట్టెల పండగ కావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న వెంటనే దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మ, ఎస్సై జిలానీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. పోలీసు కార్యాలయంలో నుంచి వచ్చిన వాహనం నితిన్‌న ఢీకొందని, ఆ వాహనం ఖచ్చితంగా పోలీసులదేనని వారు అనుమానం వ్యక్తం చేశారు. అదేక్రమంలో పోలీసు కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పడం తమ అనుమానాలకు బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ స్పందించి ఇప్పటికే కేసు నమోదు చేశారని, సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారని తెలిపారు. కేసును కప్పిపుచ్చే అవకాశమే లేదని, పోస్టుమార్టం రిపోర్ట్‌లో నిజాలు వెల్లడవుతాయన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.

నిందితులను అరెస్ట్‌ చేయాలి
నితిన్‌ మృతి కేసులో నిజాలు వెలికితీసి నిందితులను అరెస్ట్‌ చేయాలి. మూర్ఛ వ్యాధితో కిందపడి నితిన్‌ మృతిచెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కిందపడితే గాయాలు ఉండవు. అయితే నితిన్‌ శరీరంపై గాయాలున్నాయి. పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన వాహనం నితిన్‌ను ఢీకొనడంతోనే మృతిచెందాడు.    – నితిన్‌ కుటుంబసభ్యులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top