బెదిరించాలనా? చంపాలనా..?

Police Inquiry on Tahsildar Vijaya Reddy Murder Case - Sakshi

ఘటనకు ప్రేరేపించిందెవరు?

పలు కోణాల్లో తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తు

సురేష్‌ కాల్‌డేటానువిశ్లేసిస్తున్న పోలీసులు

నిందితుడి కుటుంబ సభ్యులకు భూమే లేదంటున్న అధికారులు

చికిత్సపొందుతూ తహసీల్దార్‌ డ్రైవర్‌ గురునాథం మృతి

స్వస్థలానికి మృతదేహం తరలింపు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యోదంతం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కేవలం తమ భూ వివాదం నేపథ్యంలోనే నిందితుడు కూర సురేష్‌ తహసీల్దార్‌ను సజీవదహనంచేశాడా? లేక ఇతరులు ఎవరైనా ఉసిగొల్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డిపై దాడి ఘటనకు ముందు నిందితుడు సురేష్‌ తన పెద్దనాన్న దుర్గయ్యతో పలుమార్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దుర్గయ్య, అతని కుమారుడు ఆనంద్, నిందితుని తండ్రి కృష్ణ, మరొకరు భిక్షమయ్య.. ఈ నలుగురు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి అన్ని నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. వీరి ఫోన్లతో పాటు సురేష్‌ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఘటనకు ముందు సురేష్‌ ఎక్కడెక్కడ తిరిగాడ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లొకేషన్‌ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. భూ విషయంలో న్యాయం చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని తహసీల్దార్‌ను బెదిరించాడా? లేక ఆమెను హత్య చేయడానికే పథకం వేశాడా? లేదంటే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో నిప్పంటించాడా? అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇదికాక ముందస్తు ప్రకారమే హత్య అయితే.. ఈ విషయాన్ని సురేష్‌ తన పెద్దనాన్న దుర్గయ్యకు చెప్పాడా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. నిందితుడు తీవ్ర కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటేనే మరిన్ని వివరాలు తెలిసే వీలుంది. 

ఇదీ నేపథ్యం..
అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం గ్రామంలోని 92 నుంచి 101 సర్వే నంబర్ల పరిధిలో దాదాపు 70 ఎకరాల్లో భూమి వివాదాస్పదంగా మారింది. ఈ పట్టా భూమిపై 15 మంది చొప్పున కౌలుదారులు, భూ యజమానులకు మధ్య వివాదం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సురేష్‌ నాన్నతోడ పుట్టిన వారికి, ఇతర రక్త సంబంధీకులకు ఏడెకరాల వాటా ఉందని సమాచారం. 2010 నుంచి ఈ భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, భూ యజమానుల నుంచి సాదాబైనామాలతో ఏళ్ల కిందటే తాము కొనుగోలు చేశామని, ఆ భూమి తమకే చెందుతుందని సురేష్‌ కుటుంబ సభ్యులు అంటున్నారు. భూ యజమానులు, కౌలుదారులకు అనుకూలంగా ఆర్డీఓ ఉత్తర్వులు ఇచ్చినా, జాయింట్‌ కలెక్టర్‌ తీర్పు వెలువరించినా ఆ భూమి తమదేనన్నది నిందితుని వాదన. జేసీ తీర్పును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపి వివాదాన్ని పరిష్కరించాలని జేసీకి కోర్టు సూచించింది. ఈ క్రమంలో పట్టాదారులకు గతంలో మాదిరిగానే అనుకూలంగా ఇటీవల జేసీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో తహసీల్దార్‌ విజయారెడ్డి తమకు వ్యతిరేకంగా వ్యవహరించారని సురేష్‌ ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆమెకు నిప్పంటించినట్లు ప్రచారం జరుగుతోంది. 

డ్రైవర్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి
తహసీల్దార్‌ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ గురునాథం నగరంలోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని అతని స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండకు తరలించారు. గురునాథం మృతిపట్ల జిల్లా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఉద్యోగ సంఘాల నాయకులు అతని మృతికి సంతాపం తెలిపారు.

వారికి భూమే లేదు..
ఇదిలా ఉండగా.. సురేష్, ఆయన కుటుంబ సభ్యులపై సదరు సర్వేనంబర్లలో భూమే లేదని, అయినా తహసీల్దార్‌పై దాడి ఎందుకు చేశాడోనని రెవెన్యూ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరి ప్రోద్బలంతోనైనా అమానుషానికి ఒడిగట్టి ఉంటాడేమోనని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. రికార్డుల పరంగా ఆయనకు భూమి ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేకపోవడంతో హత్యకు కారణాలు ఏమిటనేది పోలీసుల విచారణలో తేలనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top