వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

People Injured In Road Accident - Sakshi

కోహెడ ఎక్స్‌రోడ్డు వద్ద కాంక్రీట్‌ మిక్చర్, బైక్‌ ఢీ

మంగళ్‌పల్లిలో కారును ఢీకొట్టిన బైక్‌

ఇబ్రహీంపట్నంరూరల్‌ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన ఇబ్రహీంపట్నం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కోహెడ ఎక్స్‌రోడ్డు సమీపంలో కాంక్రీట్‌ మిక్చర్‌ వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన బైండ్ల రమేష్‌(32) తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్‌ హయత్‌నగర్‌ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.  

మంగళ్‌పల్లిగేటు సమీపంలో 

మంగళ్‌పల్లి గేటు నుంచి గ్రామంలోకి కారు వెళ్తుంది. మంగళ్‌పల్లి గ్రామం నుంచి గేటు వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు మద్యం సేవించి అతివేగంతో గేట్‌ వైపు వస్తున్నారు. టర్నింగ్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును బైక్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు వంద మీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న కందకంలో పడిపోయారు. క్షతగాత్రులు తుర్కయంజాల్‌ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో వీరిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. యువకుల పేర్లు తెలిసిరాలేదు. 

గుర్తు తెలియని వాహనం ఢీకొని

రాజేంద్రనగర్‌ : గుర్తు తెలియని వాహనం ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్‌ తీవ్ర గాయాలకు గురైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్‌పేట ప్రాంతానికి చెందిన రామకృష్ణ ఆటో డ్రైవర్‌ సోమవారం ఉదయం నార్సింగి నుంచి గచ్చిబౌలి వైపు ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు నుంచి వెళ్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

మరో ఘటనలో.. 

ఎదురుగా వస్తున్న కారును మరో కారు ఢీకొట్టిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చోటు చేసుకుంది. హైదర్షాకోట్‌ ప్రధాన రహదారి గూండా మహ్మద్‌ అహ్మద్‌ తన కారులో వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు అహ్మద్‌ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ అహ్మద్‌ను పోలీసులు ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 ప్రగతి నివేదనకు వెళ్లి వస్తూ ప్రాణాలొదిలాడు

కడ్తాల్‌ : టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు త్రీవంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.... నాగర్‌కర్నూల్‌ జిల్లా తెల్కపల్లి మండలం గౌరరానికి చెందిన దూదేకుల జహంగీర్‌ (42)తో పాటు అదే గ్రామానికి చెందిన బాలపీర్, గౌస్‌లు ఆదివారం సభకు వ్యానులో వెళ్లారు.

సభ ముగిసిన అనంతరం తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరారు. కాగా మార్గమధ్యలో వీరి వాహనాన్ని మైసిగండి సమీపంలో నిలిపారు. అక్కడే వంట చేసుకుని తిని వెళ్దామని వారంతా అక్కడ వాహనాన్ని నిలిపారు. ఇదే సమయంలో జహంగీర్, బాలపీర్, గౌస్‌లు రోడ్డు దాటుతుండగా వీరిని క్రూజర్‌ వాహనం భీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలకు కాగా 108లో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. తీవ్ర గాయలైన జహంగీర్‌ చికిత్స పొందుతూ మృతి చెందగా, బాలపీర్, గౌస్‌లు చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top