వృద్ధ దంపతుల ఆత్మహత్య  | old Couples commits suicide in rajanna Sircilla district | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల ఆత్మహత్య 

Nov 26 2017 2:19 AM | Updated on Nov 6 2018 8:08 PM

old Couples commits suicide in rajanna Sircilla district - Sakshi - Sakshi - Sakshi

వేములవాడ అర్బన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెంది న ఏడుమేకల నర్సయ్య(69), మల్లవ్వ(64) దంపతులు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వాసంపల్లికి చెందిన నర్సయ్య, మల్లవ్వలు.. మల్లవ్వ పుట్టినిల్లు అయిన నూకలమర్రికి 35 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డారు. కూలీ పని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సంతానం లేదు. వయస్సు మీద పడిన క్రమంలో రేషన్‌ బియ్యం, ఆసరా పింఛన్‌తో సొంత ఇంట్లో ఉంటున్నారు. నాలుగేళ్ల కిందట మల్లవ్వ అనారోగ్యం బారిన పడింది. కడుపునొప్పితో బాధపడింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా గర్భసంచి ఆపరేషన్‌ చేశారు. 

మూడేళ్ల క్రితం మళ్లీ మల్ల వ్వ కిడ్నీలకు సంబంధించిన వ్యాధి బారిన పడింది. వెన్నుపూస నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం నయంకాలేదు. మంచానికి పరిమితమైంది. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించింది. నర్సయ్యే ఆమెకు సపర్యలు చేసేవాడు. కూలీ పనులు చేసినా ఆమె మందులకు డబ్బులు సరిపోవ డం లేదు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన నర్సయ్య.. మల్లవ్వలు ఇంట్లోనే పురుగుల మందుతాగారు. శనివారం ఉదయం తొమ్మి దైనా.. దంపతులు తలుపులు తీయకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. పక్కనే క్రిమిసంహారక మందు డబ్బా ఉంది. వేములవాడ పోలీసులకు సమాచారం అందించారు. వేములవాడ రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement