నవవధువు అనుమానాస్పద మృతి
బనశంకరి : నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... మండ్య జిల్లా మద్దూరుకు చెందిన హర్షిత (25), బెంగళూరు చిక్కలసంద్రకు చెందిన చేతన్కు ఇచ్చి ఈనెల ఒకటిన వివాహం జరిగింది. హర్షిత నగరంలోని కాల్సెంటర్లో ఉద్యోగం చేస్తూ పీజీలో ఉంటోంది. భర్త చేతన్ కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఇటీవల హనీమూన్కు వెళ్లిన దంపతులు బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. గురువారం ఉదయం చేతన్ బయటకు వెళ్లిన సమయంలో హర్షిత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపు అనంతరం ఇంటికి వచ్చిన చేతన్ విషయం గుర్తించి హర్షితను ఆస్పత్రికి తరలించారు. అనంతరం హర్షిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. తమ కుమార్తెను చేతన్ కుటుంబ సభ్యులే హత్యచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.