పక్కా స్కెచ్‌.. 10 కోట్ల డ్రగ్స్‌ కొట్టేశారు..! | Narcotics Officers Arrested Renigunta Drugs Robbery Accused | Sakshi
Sakshi News home page

పక్కా స్కెచ్‌.. 10 కోట్ల డ్రగ్స్‌ కొట్టేశారు..!

May 18 2019 11:45 AM | Updated on May 18 2019 11:58 AM

Narcotics Officers Arrested Renigunta Drugs Robbery Accused - Sakshi

మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేసి సస్పెండైన దక్షిణా మూర్తి అనే మాజీ ఉద్యోగి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిట్టిబాబు అనే వక్తితో కలిసి..

సాక్షి, తిరుపతి : రేణిగుంటలోని ఓ డ్రగ్స్‌ ఫ్యాక్టరీలో గత నెలలో చోరీకి గురైన రూ.10 కోట్ల విలువైన అల్ఫాజోన్‌ దోపిడీ కేసులో నిందితులు పట్టుబడ్డారు. ప్యాక్టరీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులతో కలిసి ఓ మాజీ ఉద్యోగి ఈ చోరీలో నిందితులుగా ఉన్నారని తెలిసింది. వివరాలు.. రేణిగుంటలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేసి సస్పెండైన దక్షిణా మూర్తి అనే మాజీ ఉద్యోగి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిట్టిబాబు అనే వక్తితో కలిసి డ్రగ్స్‌ కొట్టేయడానికి పథకం పన్నారు. ఆల్ఫాజోన్ అనే అతి ఖరీదైన మత్తుమందును కాజేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఫ్యాక్టరీలోని స్టోర్‌లో పనిచేస్తున్న నాగరాజు, శ్రీనివాసులు అనే వ్యక్తులకు రూ.10 లక్షలు ఆశ చూపి వారి ద్వారా గత నెలలో 30  కేజీల ఆల్ఫాజోన్ కాజేశారు. తర్వాత బెంగుళూరులో ఓ వ్యక్తికి 15 కేజీలను అమ్మేసి మిగిలిన దానిని దక్షిణామూర్తి తన ఇంట్లో  దాచిపెట్టాడు. 

అదేక్రమంలో బెంగుళూరులోని నార్కోటిక్ అధికారులు ఒక డ్రగ్స్ కేసులో ముద్దాయిని అరెస్టు చేయగా అతని వద్ద భారీగా మత్తుమందు దొరికింది. విచారణలో రేణిగుంటలోని మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారి వద్ద దానిని కొనుగోలు చేసానని చెప్పాడు. పేర్లు వెల్లడించారు. నార్కోటిక్ అధికారులు బుధవారం సాయంత్రం ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని చిట్టిబాబు, నాగరాజు, శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పేసుకున్నారు. అనంతరం దక్షిణామూర్తిని పట్టుకుని అతని ఇంట్లో దాచిపెట్టిన 15  కేజీల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను హైదరాబాద్‌ కార్యాలయానికి తరలించారు. నిందితుల వివరాలు... చిట్టిబాబు - అడుసుపాళ్యం, శ్రీనివాసులు - గాజులమండ్యం, నాగరాజు - కే ఎల్ ఏం హాస్పిటల్, దక్షిణా మూర్తి - కే ఎల్ ఏం హాస్పిటల్.

Advertisement
 
Advertisement
Advertisement