శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి...

Missing Family Found Buried in Kerala Thdopuzha - Sakshi

సాక్షి, తిరువనంతపురం: కనిపించకుండా పోయిన ఓ కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఘటన కేరళలో కలకలం రేపింది. ఇడుక్కి జిల్లా తోడోపుజా గ్రామానికి చెందిన కృష్ణన్‌, అతని భార్య ఇద్దరు పిల్లలు గత నాలుగు రోజులుగా అదృశ్యమైనట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఇంటి పెరట్లోనే వారి మృతదేహాలను వెలికి తీశారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

నాలుగు రోజులుగా ఆ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఇంట్లోకి వెళ్లిన బంధువులు ఇంటి గోడలకు రక్తపు మరకలు ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డాగ్‌ స్క్వాడ్‌ సాయం తీసుకోగా.. అవి పెరట్లోని ఓ గుంత వద్ద ఆగిపోయాయి. అక్కడ తవ్వి చూసిన పోలీసులు నాలుగు మృత దేహాలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. మృతులను కృష్ణన్‌(56), సుశీల(52), ఆర్ష(21), అర్జున్‌(19) గా గుర్తించారు. ఇంట్లో ఓ సుత్తి, కత్తికి రక్తపు మరకలు ఉండటంతో వారిని వాటితోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయాల ఆధారంగా వారిని కిరాత​కంగా హత్య చేశారని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కృష్ణన్‌కు భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా ఆ ప్రాంతంలో పేరుంది. పలువురు ప్రముఖులు కూడా అతన్ని కలుస్తుంటారని తెలుస్తోంది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఆ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వారితో కూడా కలివిడిగా ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. చేతబడి, కోణంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టాయం మెడికల్‌ కాలేజీకి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించిన పోలీసులు.. పోస్ట్‌ మార్టం నివేదిక ఆధారంగా కేసును త్వరగా చేధిస్తామని అంటున్నారు.

బురారీ కేసు; ఊహించని ట్విస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top