పుట్టిన రోజునే.. అనంతలోకాలకు.. | Man Suicide His Birthday Night In Visakhapatnam | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజునే.. అనంతలోకాలకు..

Aug 6 2018 1:01 PM | Updated on Nov 6 2018 8:08 PM

Man Suicide His Birthday Night In Visakhapatnam - Sakshi

రోదిస్తున్న శ్యాం తల్లిదండ్రులు, బంధువులు శ్యాంకుమార్‌ (ఫైల్‌)

విశాఖపట్నం ,అక్కిరెడ్డిపాలెం(గాజువాక): పుట్టిన రోజు వేడుకలను ఓ యువకుడు ఆనందంగా జరుపుకున్నాడు. ఏమైందో గానీ అందరూ నిద్రపోయిన తర్వాత తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో విషాదం నింపాడు. జీవీఎంసీ 59వ వార్డు రెడ్డి తుంగ్లాలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి గాజు వాక పోలీసులు తెలిపిన వివరాలివి. ఆటోనగర్‌ సాహు వాలా సిలిండర్స్‌ కంపెనీ ఎదురుగా  రెడ్డి తుంగ్లాంలో నివసిస్తున్న మాణివెళ్తి అప్పారావు, నాగమణి దంపతులకు సంతోష్‌ కుమార్, శ్యాంకుమార్‌ (25)లు కుమారులున్నారు. వీరంతా తమ సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. శ్యాంకుమార్‌ ఆటోనగర్‌లోని ఓ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతను శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి రాత్రి ఆనందంగా గడిపాడు. అనంతరం అందరూ తమ గదుల్లో నిద్రకు ఉపక్రమించారు.

శ్యాం తప్పితే అందరూ ఆదివా రం ఉదయం నిద్రలేశారు. అతను బాగా నిద్రపోతున్నాడని కుటుంబ సభ్యులు తలచారు. ఉదయం 10 గంటలు కావస్తున్నా అతను నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు గట్టిగా బాదారు. గది కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు చూడగా శ్యాం మంచంపై అచేతనంగా పడి ఉన్నాడు. మొహం గోడకు తగిలి, నేలపై తీవ్ర రక్తస్రావం అయి ఉండటంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఎస్‌ఐ మన్మథరావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. శ్యాంకుమార్‌ చీరతో ఫ్యాను ఉరివేసున్నాడని, ప్రాణం పోయే క్షణంలో చీర ముడివీడటంతో కిందకు పడిపోయాడని పోలీసులు తెలిపారు. మొహం గోడకు తగలి దవడ వద్ద తీవ్ర గాయం కారణంగా రక్తస్రావం జరిగిందన్నారు. అనంతరం గాజువాక సీఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. అయితే యువకుడు ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement