విహారంలో విషాదం | Man Missing in Mypadu Beach PSR Nellore | Sakshi
Sakshi News home page

విహారంలో విషాదం

Jun 3 2019 1:28 PM | Updated on Jun 3 2019 1:28 PM

Man Missing in Mypadu Beach PSR Nellore - Sakshi

స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ శ్రీనివాసరావు

ఇందుకూరుపేట: స్నేహితులందరూ ఆదివారం సరదాగా విహారానికి వచ్చి విషాదానికి గురయ్యారు. మండలంలోని మైపాడు బీచ్‌లో అలల తాకిడికి నీట మునిగి ఓ యువకుడు గల్లంతు కాగా, మరో యువకుడు మృతి చెందాడు. పోలీసుల  సమాచారం మేరకు.. కోవూరు మండలం జమ్మిపాళెంకు చెందిన ఉడతా శ్రీహరి (19), తిరువీధి పవన్‌ (14) ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 15 మంది  ఆదివారం మైపాడు బీచ్‌కు సేద తీరేందుకు వచ్చారు. అందరూ కలిసి సరదాగా నీటిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సమయంలో అలల తాకిడికి శ్రీహరి, పవన్‌తో పాటు మరో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గమనించిన తోటి వారు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు నలుగురిలో ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. శ్రీహరి నీటిలో మునిగి మృతి చెందగా,  పవన్‌ గల్లంతయ్యాడు. అప్పటి వరకు తమ కళ్ల ఎదుటే ఉన్న శ్రీహరి విగత జీవిగా మారడం, పవన్‌ కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్‌ కోసం వెంట వచ్చిన బందువులు, స్నేహితులు తీరం వెంబడి చేరి గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement