ప్రమాదంలో వ్యక్తి మృతి..10 వాహనాలకు నిప్పు
సెహోర్(మధ్యప్రదేశ్): సెహోర్ షాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి బుధవారం రాత్రి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు సమీపంలో ఉన్న 10 ఇసుక రవాణా చేసే వాహనాలకు నిప్పుపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలు ఢీకొనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వెంటనే ఇసుక వాహనాలు ఈ ప్రాంతంలో నిషేంధించాలని, ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ కోసం వెతుకుతున్నామని, కచ్చితంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు స్థానిక అడిషనల్ ఎస్పీ సమీర్ యాదవ్ హామీ ఇచ్చారు.