మహిళ కోసం స్నేహితుడి హత్య | man killed by his friend | Sakshi
Sakshi News home page

మహిళ కోసం స్నేహితుడి హత్య

Jan 25 2018 3:02 PM | Updated on Jul 30 2018 8:27 PM

man killed by his friend - Sakshi

డోన్‌ టౌన్‌ : చెడు వ్యసనాలే అతడి ప్రాణం తీశాయి. పర స్త్రీ వ్యామోహంలో పడిన అతడు చివరకు స్నేహితుడి చేతిలోనే హతమయ్యాడు. బేతంచర్ల మం‍డలం ఆర్‌ ఎస్‌ రంగాపురంలో ఆరు నెలల క్రితం జరిగిన హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ బుధవారం తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన డేగల శేషు ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య వదిలేసింది. దీంతో అతడు తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన బోయసుదేపల్లె మధుతో స్నేహంగా మెలిగేవాడు. ఇద్దరు తాగుడుతోపాటు చెడు తిరుగుళ్లు తిరిగేవారు. ఈ క్రమంలో ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

దీంతో మధు శేషును ఎలాగైనా అంతమొందిం‍చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన బంధువులు వెంకటేశ్వర్లు, సాంబశివుడుతో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించాడు. గతేడాది ఆగస్టు 17న శేషు తన ఇంటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంపై నిద్రిస్తుండగా ముగ్గురూ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మధునే హత్య చేసినట్లు తేలింది. ఈ మేరకు నిందితులను మంగళవారం సాయంత్రం రంగాపురం పొలిమేరల్లో అరెస్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కంబగిరిరాముడు, ఎస్‌ఐ తిరుపాల్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement