వేధింపులు మానుకోవాలన్నందుకు..
వ్యక్తిపై దాడి
కేపీహెచ్బీకాలనీ: తన భార్యను వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తి తీరు మార్చుకోవాలని మందలించేందుకు అతని ఇంటికి వెళ్ళగా సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేసిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బీకాలనీ, లోథా బెల్లెజలో ఉంటున్న విజయ్కుమార్ భార్యను అదే అపార్ట్మెంట్లో ఉంటున్న సాయిరాజ్ అనేవ్యక్తి వెంబడించడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నాడు.
బాధితురాలు ఈ విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో విజయ్కుమార్ ఆదివారం సాయంత్రం సాయిరాజ్ను మందలించేందుకు అతడి ఇంటికి వెళ్ళాడు. సాయిరాజ్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి అతని ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న సాయిరాజ్ ఇనుపరాడ్డుతో విజయ్కుమార్పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.