బర్త్ డే వేడుకలకు వెళ్తూ.. మృత్యుఒడిలోకి..
తాటి చెట్టుకు ఢీకొట్టిన స్కూటీ
ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
సంగెం: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తూ ఓ విద్యార్థి మృత్యుఒడికి చేరాడు. తాటిచెట్టుకు స్కూటీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన సంగెం మండల కేంద్రం శివారులోని సున్నపురాళ్ల కుంట కట్టపై బుధవారం జరిగింది. మండలంలోని కృష్ణానగర్ గ్రామానికి చెందిన కుక్కల లక్ష్మణ్(17), గీసుకొండ మండలం ఊకల్కు చెందిన కానుగంటి రాజ్కుమార్, వరంగల్ పోచమ్మ మైదాన్కు చెందిన మషిరాబాద్ ప్రసంగిపాల్ సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు.
కళాశాలలో స్వాత ంత్య్ర వేడుకలకు హాజరైన తర్వాత ప్రసంగిపాల్ తన పుట్టిన రోజును జరుపుకోవడానికి స్కూటీపై రాజ్కుమార్, లక్ష్మణ్ను ఎక్కించుకున్నాడు. మరో బైక్పై మరికొందరు కలిసి సంగెం నుంచి గవిచర్ల వైపు బయల్దేరారు సంగెం సున్నపురాళ్ల కుంట కట్టపై స్కూటీ అదుపుతప్పి తాటిచెట్టుకు ఢీకొంది. గాయపడిన లక్ష్మణ్, రాజ్కుమార్ను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతిచెందాడు. మెరుగైన చికిత్స కోసం రాజ్కుమార్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రసంగిపాల్ పరారీలో ఉన్నాడు.
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు..
కృష్ణా నగర్కు చెందిన కుక్కల మల్లేశ్, అరుణ దంపతులకు కుమారులు సాంబరాజు, రామ్, లక్ష్మణ్ ఉన్నారు. కవల పిల్లల్లో పెద్దవాడైన రామ్ ఇంటికి చేరుకోగా లక్ష్మణ్ స్నేహితులతో వెళ్లి మృత్యువాతపడడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో అందరు పోచమ్మ తల్లి బోనాల సందడితో ఉండగా లక్ష్మణ్ మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ విషయమై సంగెం ఎస్సై దీపక్ను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.