డబ్బు కోసం కక్కుర్తి; బతికున్న వ్యక్తిని..

UP Man Declared Dead Wakes Up Just Before Burial - Sakshi

లక్నో : డబ్బులకు కక్కుర్తి పడిన ఓ ఆస్పత్రి యాజమాన్యం బతికి ఉన్న వ్యక్తిని శవంలా చిత్రీకరించింది. బాధితుల నుంచి అందినకాడికి వసూలు చేసి ఆనక మోసం చేసింది. వారి మాటలు నమ్మి అతడి ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదృష్టవశాత్తు చివరి నిమిషంలో అతడిలో కదలిక రావడంతో.. వెంటనే తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లక్నో ప్రధాన వైద్యాధికారి సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బాధితులు తెలిపిన వివరాల మేరకు..గత నెల 21న మహ్మద్‌ ఫర్ఖాన్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు దాదాపు రూ. 7 లక్షలు వెచ్చించారు. ఈ క్రమంలో సోమవారం అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో ఫర్ఖాన్‌ అంత్యక్రియల కోసం అంతా సిద్ధం చేశారు. ఖననం చేయడానికి కొన్ని నిమిషాల ముందు అతడిలో కదలిక రావడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై అతడికి చికిత్స అందిస్తున్నారు. తాము ఇక డబ్బు చెల్లించలేదనే ఉద్దేశంతోనే ఫర్ఖాన్‌ చనిపోయాడని చెప్పి తమతో ఆడుకున్నారని అతడి సోదరుడు ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపాడు. తన తమ్ముడు త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top