‘మోదీని లేపేస్తా’... ఆడియో క్లిప్‌ వైరల్‌ | Man Arrested After Eliminate Modi Audio Clip Viral | Sakshi
Sakshi News home page

Apr 24 2018 11:00 AM | Updated on Aug 15 2018 2:40 PM

Man Arrested After Eliminate Modi Audio Clip Viral - Sakshi

కోయంబత్తూర్‌ ; ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానంటూ వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి వెలుగులోకి రావటంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు మహ్మద్‌ రఫిక్‌.. 1998 కోయంబత్తూర్‌ పేలుళ్ల కేసు దోషి కావటం విశేషం.

ఆడియో క్లిప్‌లో ఏముందంటే... సుమారు ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఆ ఆడియో టేపులో రఫిక్‌-ప్రకాశ్‌ అనే ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌కు నడుమ మధ్య సంభాషణ జరిగింది. వాహనాలు.. ఆర్థిక లావాదేవీల గురించి ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న తరుణంలో హఠాత్తుగా రఫిక్‌ మోదీ ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘అద్వానీ పర్యటన సందర్భంగా 1998లో బాంబులు పేల్చింది మేమే. ఇప్పుడు ప్రధాని మోదీని లేపేయాలని నిర్ణయించాం. నాపై బోలెడన్ని కేసులు ఉన్నాయి. వందకు పైగా వాహనాలను నేను ధ్వంసం చేశా’ అంటూ రఫిక్‌ మాట్లాడాడు. ఎలా బయటకు వచ్చిందో తెలీదుగానీ.. ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రఫిక్‌ను అతని స్వస్థలం కునియాముత్తూరులో అరెస్ట్‌ చేశారు. 

కోయంబత్తూరు(కోవై) పేలుళ్ల కేసు నేపథ్యం... 1998లో బీజేపీ నేత ఎల్‌ కే అద్వానీ పర్యటన సందర్భంగా నిషేధిత అల్ ఉమ్మా సంస్థకు చెందిన కుంజు మహ్మద్‌.. అతని అనుచరులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 58 మంది మరణించగా.. సభకు ఆలస్యంగా రావటంతో అద్వానీ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. తమిళనాడు ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో రఫిక్‌ కూడా ఒకడు.

                                               మహ్మద్‌ రఫిక్‌ (ఫైల్‌ ఫోటో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement