లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష | Lalu Sentenced 14 Years Jail Term in Fodder Scam Case | Sakshi
Sakshi News home page

లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష

Mar 24 2018 2:44 PM | Updated on Mar 24 2018 5:53 PM

Lalu Sentenced 14 Years Jail Term in Fodder Scam Case - Sakshi

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (పాత చిత్రం)

రాంచీ : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రాంచీ సీబీఐ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. దాణా స్కామ్‌కు సంబంధించి నాలుగో కేసులో ఈ మధ్యే లాలూను దోషిగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం లాలూకు 14 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది.

ఐపీసీ సెక్షన్ల కింద 7 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద 7 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను ఒకదాని వెంటే మరొకటి విధిస్తున్నట్లు న్యాయమూర్తి శివ్‌పాల్‌ సింగ్‌ వెల్లడించారు. అయితే తీర్పు కాపీ అందితేనే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని లాలూ తరపు న్యాయమూర్తి అంటున్నారు. శిక్షలతోపాటు  రూ. 60 లక్షల ఫైన్‌ విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, డుంక ఖ‌జానా నుంచి డిసెంబర్‌ 1991- 1996 మధ్య సుమారు రూ. 3 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌లు అక్ర‌మంగా  విత్ డ్రా చేసిన సంఘ‌ట‌న‌కు సంబంధించిన‌ కేసు ఇది. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచార‌ణ ఎదుర్కొగా.. చివరకు లాలూను దోషిగా తేల్చారు.

ఐసీసీ సెక్షన్లు 120-బీ, 419, 420, 467, 468 సెక్షన్ల కింద ఆయనకు శిక్షకు ఖరారైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

‘మా నాన్నకు ప్రాణహని ఉంది’
కాగా, శిక్షలపై స్పందించిన లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌.. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ‘బీజేపీ-జేడీయూ రాజకీయ కుట్రంలో మా నాన్న బాధితుడు అయ్యాడు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది’ అని తేజస్వి తెలిపారు. ఇక మరోవైపు ఆర్జేడీ పార్టీ అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement