‘బడికి కాదు.. కాటికి సాగనంపా’ | Inconsolable Mother, Lost Their Three Children In UP School Bus Accident | Sakshi
Sakshi News home page

Apr 27 2018 11:02 AM | Updated on Apr 27 2018 11:07 AM

Inconsolable Mother, Lost Their Three Children In UP School Bus Accident - Sakshi

ప్రమాద స్థలం..

లక్నో, కుశినగర్‌ : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తాలూకు బాధిత కుటుంబాల్లో శోకం అలుముకుంది. స్కూల్‌ వ్యాన్‌ను రైలు ఢీకొట్టిన ఘటనలో 13 మంది విద్యార్థులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మిశ్రౌలీ గ్రామ పెద్ద కిరణ్‌దేవి తన ముగ్గురు బిడ్డల్ని కోల్పోయారు. ఘటనలో రవి (12), సంతోష్‌ (10), రాగిణి (7)లు విగతజీవులుగా మారారు.

‘బడికి వెళ్లమని నా పిల్లలు మొండికేశారు. కానీ బలవంతంగా వారిని బస్సు ఎక్కించి నా చేతులారా నేనే చంపుకున్నా’అని కిరణ్‌ దేవి గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనతో షాక్‌కు గురైన చిన్నారుల తండ్రి ఇంకా తేరుకోలేదు. ‘మా మనుమలు, మనమరాలు ఫోటోలు గోడకు వేలాడుతున్నాయి. కానీ వారు లేరనే విషయాన్ని నమ్మలేక పోతున్నాం. ఆ ఫోటోలపైపు చూడాలంటేనే భయంగా ఉంది’ అని చిన్నారుల తాతయ్య హరిహర ప్రసాద్‌ భోరున విలపించాడు. తన కొడుకు పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నాడని.. ఇప్పుడు తమ వంశానికి వారసులే లేకుండా పోయారని వాపోయాడు. 

కుశినగర్‌ జిల్లాలో కాపలా లేని ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద గురువారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. రైలు ఢీకొట్టడంతో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా 12 ఏళ్లలోపు వాళ్లే. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగుగు విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం యోగి ఆదిత్యానాథ్‌.. ప్రభుత్వం తరపున రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement