భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకుని.. 

Husband Killed Wife And Commits Suicide In Karimnagar - Sakshi

ఇల్లందకుంట(హుజూరాబాద్‌) : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ఆపై అనుమానంతో భార్యను హతమార్చిన భర్త ఆపై తానూ ఉరేసుకుని, పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట స్వామిమల్లయ్య (48), పుట్ట రాధ(45) భార్యాభర్తలు. వీరి కి ఇద్దరు కుమారులు శ్రీకాంత్, రాజు , కూతురు స్వప్న సంతానం. వీరికున్న ఎకరంతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని.. సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. ఇద్దరు కొడు కులు చదువుల నిమిత్తం హన్మకొండ వెళ్లారు. స్వప్న కొడుకులు శ్రావణ్, మనోజ్‌ వీరితో నే ఉంటున్నారు.  

అనుమానం.. వేధింపులు 
రాధపై అనుమానం పెంచుకున్న మల్లయ్య భార్యను వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసి.. ఇంటికొచ్చిన దంపతులు మరోసారి గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన మల్లయ్య కర్రతో భార్యపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే చనిపోయింది. దీంతో భయానికి గురైన మల్లయ్య ముందుగా క్రిమిసంహారక మందుతాగాడు. అనంతరం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి  తలుపులు తెరిచిచూడగా.. ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. పక్క గదిలో పడుకున్న చిన్నారులు అరుస్తూనే ఉన్నారు.  

పరిశీలించిన ఏసీపీ 
సిరిసేడు గ్రామంలో దంపతులిద్దరూ మృత్యువాతపడిన సంఘటన తెలుసుకున్న హుజూరాబాద్‌ ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్, సీఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని  హత్యకు, ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఈర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top