బాత్‌రూమ్‌లో కిందపడి విద్యార్థిని మృతి

HCU PHD Student Died in Bathroom Hyderabad - Sakshi

మూర్చవ్యాధి కారణమంటున్న పోలీసులు కేసు నమోదు  

గచ్చిబౌలి :బాత్‌రూమ్‌లో కిందపడటంతో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సోమవారం చోటు చేసుకుంది.  సీఐ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆదివాసి స్టడీస్‌లో   పీహెచ్‌డీ చేస్తున్న దీపిక మహాపాత్ర (29) ఎల్‌హెచ్‌1 హాస్టల్‌లోని రూమ్‌ నెంబర్‌ 204 లో ఉంటోంది. సోమవారం ఉదయం ఉదయం బాత్‌రూంలోకి వెళ్లిన దీపిక కింద పడిపోయింది. శబ్ధం రావడంతో స్నేహితులు అక్కడికి వెళ్లి పిలిచినా స్పందించలేదు. దీంతో బాత్‌రూం తలుపులు తోసి చూడగా ఆమె కింద పడి ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బంది ఆమెను నల్లగండ్లలోని సిటిజన్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు దీపిక కొంతకాలంగా ఎపిలెప్సీ (మూర్చ) వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు ధృవీకరించిన కేస్‌ షీట్‌లు లభించినట్లు తెలిపారు. దీనిని బట్టి ఆమె నరాల సంబంధ వ్యాధి కారణంగానే వెనక వైపు పడిపోవడంతో మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top