బంగారు బిస్కెట్లతో పరారైన గోల్డ్‌స్మిత్‌ అరెస్ట్‌ | Gold Smugglers Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

బంగారు బిస్కెట్లతో పరారైన గోల్డ్‌స్మిత్‌ అరెస్ట్‌

Mar 28 2019 6:54 AM | Updated on Mar 28 2019 6:54 AM

Gold Smugglers Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రాంరెడ్డి, డీఐ శ్రీనివాసరావు

సనత్‌నగర్‌: ఆభరణాలు చేసి ఇస్తానని ఓ వ్యక్తి నుంచి బంగారు బిస్కెట్లను తీసుకుని పరారైన గోల్డ్‌స్మిత్‌ను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 129.5 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఏసీపీ రాంరెడ్డి, డీఐ శ్రీనివాసరావు బుధవారం వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, మల్దా జిల్లా, షాపూర్‌ ప్రాంతానికి చెందిన రంజన్‌ కాంచన్‌ అధికారి అలియాస్‌ సుజాయా సనా అలియాస్‌ సుభంకర్‌ హాజీ బతుకుదెరువు నిమిత్తం స్నేహితుడు సునీల్‌ ద్వారా నగరానికి వలసవచ్చి గోల్డ్‌స్మిత్‌గా పని చేస్తున్నాడు.  రసూల్‌పురా ప్రాంతంలోని బీహెచ్‌ఈఎల్‌ కాలనీలో ఉంటూ ఆభరణాలు తయారు చేసేవాడు.

ఈ నేపథ్యంలో సునీల్‌ ఆభరణాలు తయారు చేయాలని తనకు పరిచయం ఉన్న ఓ వ్యాపారి ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు.  అప్పటి నుంచి పలుమార్లు సదరు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లు తీసుకుని ఆభరణాలు చేసి ఇస్తున్న రంజన్‌ నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 26న సదరు వ్యక్తి నుంచి రూ.4.5 లక్షల విలువైన 149.88 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్న రంజాన్‌  ఆభరణాలు చేసి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితుడు రంజన్‌  పాట్‌ మార్కెట్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ.3.9 లక్షల విలువైన 129.5 గ్రాముల రెండు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వరరావు, డీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో కాంచన్‌ను అరెస్టు చేసిన డీఎస్‌ఐ  ముత్యంరాజు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement