ఘోర రోడ్డు ప్రమాదాలు..14మంది దుర్మరణం
సాక్షి, పుణె: రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని కడెగావ్ సమీపంలోని సంగ్లీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్ల్లోకి వెళితే...రెజలర్స్ పోటీలో పాల్గొని పుణె నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్న ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రెజలర్స్తో పాటు డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మితిమిరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
నీటికుంటలో బస్తు బోల్తా.. 8మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లా కరెకెరెలో శనివారం ఉదయం బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి నీటికుంటలో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరు నుంచి శుక్రవారం రాత్రి 43మంది ప్రయాణికులతో కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదెరింది. ధర్మస్థలా సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.