
హసన్పర్తి: రోడ్డు ప్రమాదానికి గురై పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడిన ఓ వ్యక్తి 30 గంటల పాటు మృత్యువుతో పోరాడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా నాగారం సమీపంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన మొగిలి అడ్తి వ్యాపారి. గురువారం బ«ంధువుల ఇంటికి వెళ్లిన అతను శుక్రవారం తెల్లవారుజామున జమ్మికుంటకు బైక్పై బయల్దేరాడు. నాగారం సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయబావిలోకి బైక్ దూసుకెళ్లింది. మొగిలికి ఈత రావడంతో ఈదుకుంటూ మోటారుకు అమర్చిన పైపులను పట్టుకుని ఉన్నాడు. హన్మకొండ నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరిన మొగిలి ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేస్తే నంబర్ కలిపినా పని చేయలేదు. దీంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
30 గంటలు మృత్యువుతో పోరాటం
శుక్రవారం తెల్లవారుజామున బావిలో పడిన మొగిలి శనివారం మధ్యాహ్నం వరకు అందులోనే పైపులను పట్టుకొని ఉన్నాడు. బావి వద్దకు మోటారు ఆన్ చేయడానికి వచ్చిన రైతు సమ్మిరెడ్డి మొగిలిని గమనించి చుట్టుపక్కవారి సహకారంతో అతడిని బయటకు తీశారు. గాయాలైన మొగిలిని ఆస్పత్రికి తరలించారు.