ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు | Extra Marrital Affairs Leading To Murders | Sakshi
Sakshi News home page

ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు

Mar 21 2019 1:01 PM | Updated on Mar 21 2019 1:16 PM

Extra Marrital Affairs Leading To Murders - Sakshi

మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు కట్టుకున్న భర్తల ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. వారం వ్యవధిలో కోదాడ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడు ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపరుస్తున్నాయి. మూడు ఘటనల్లో రెండింటిలో భార్యలే భర్తల హత్యకు సూత్రధారులుగా వ్యవహరించగా ప్రియులు పాత్రధారులుగా మారి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. మరో ఘటనలో ఓ భర్త  తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ప్రియుడిని దారుణంగా హత్యచేసాడు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి జైలుపాలు కావడంతో మూడు కుటుంబాల్లో చిన్న పిల్లలు అనాథలుగా మారారు.

సాక్షి, కోదాడ : మూడు హత్యలను పరిశీలిస్తే తాత్కాలిక ఆకర్షణకు లోనైన వీరు కుంటుంబ పరిస్థితులను పట్టించుకోకుండా వివాహేతర సంబంధాలను కొనసాగించారు. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తలను పొట్టన పెట్టుకున్నారు. గుడిబండ గ్రామానికి  చెందిన పులికాశయ్య హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ వద్ద ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న యువకుడితో కాశయ్య భార్య నాగలక్ష్మి విహహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది.

బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరో ఘటనలో  చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన కుక్కల గోపిని అతని భార్య రేణుక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో దారుణంగా హత్య చేయించింది. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో పట్టుమని పది సంవత్సరాలు కూడా లేని వీరి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు.

భార్యభర్త చేతిలో ప్రియుడు
ఇక నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఓ భర్త తన భార్యతో కలిసి యువకుడిని దారుణంగా హత్య చేసి సాగర్‌ కాలువలో పడవేశాడు. పక్షం రోజుల తర్వాత ఘటన వెలుగు చూడడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో యువకుడు రహీం హత్యకు గురికాగా భార్యభర్తలు కోటయ్య, త్రీవేణిలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీరి కొడుకు ఇపుడు దిక్కులేనివాడయ్యాడు.

ఇటీవల హత్యకు గురైన కుక్కల గోపి గుడిబండ వాసి పులి కాశయ్యరహీమ్‌ (ఫైల్‌) 

పాపం పసివాళ్లు
ఇలాంటి బంధాల వల్ల అభం శుభం తెలియని పసిపిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయ్యారయ్యింది. కోదాడలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లో పదేళ్ల లోపు ఐదుగురు పిల్ల అనాథలు గా మారారు. తండ్రి మరణించడం, తల్లి జైలుపాలు కావడంతో వారి అలనాపాలనా చూసే వారు కరువయ్యారు. అసలేం జరిగిందో కూడా అర్థం చేసుకోలేని వయస్సులో జరిగిన ఈ ఘటనలు వారి మనస్సులపై  తీవ్ర ప్రభావం చూపుతా యని ఇలాంటి బంధాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement