వైద్యానికి వస్తే.. ప్రాణం పోయింది

Doctor Negence Woman Dies In Karimnagar - Sakshi

కోల్‌సిటీ(రామగుండం): జ్వరం వచ్చిందని ఓ మహిళ ఆస్పత్రికి వస్తే... ప్రాణమే పోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం చోటు చేసుకుంది. వైద్యులు వేసిన ఇంజక్షన్లు వికటించడంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పిల్లి వేణుగోపాల్, సంధ్య(25) దంపతులు. వీరికి ఐదు సంవత్సరాల కూతురు ఉంది. సంధ్యకు వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో, ఈనెల 10న రామగుండం వీక్లీ మార్కెట్‌ సమీపంలోని తన పుట్టింటికి వచ్చింది. స్థానికంగా ఆర్‌ఎంపీల దగ్గర వైద్యం చేయించినప్పటకీ తగ్గకపోవడం, వాంతులు అవుతుండడంతో, గురువారం గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

శుక్రవారం కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రి డాక్టర్‌ సూచనల మేరకు సిబ్బంది వరుసగా నాలుగైదు ఇంజక్షన్లు వేశారు. కాసేటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన ఆస్పత్రి డాక్టర్, స్థానికంగానే మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్‌లోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోకి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. సంధ్య మృతి చెందడానికి గోదావరిఖనిలో తొలత చేర్పించిన ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్లు వికటించడంతోనేనని ఆరోపించారు.

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశా రు. మృతిరాలి కటుంబానికి న్యాయం చెయ్యాలని, ఆస్పత్రిని మూసివేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వన్‌టౌన్‌ సీఐ వాసుదేవరావు, ఎస్సై ఉపేందర్‌రావు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, దాడులకు పాల్పడడం సరికాదని హెచ్చరించారు. చివరికి కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఆస్పత్రి వైద్యులు, మృతురాలి బంధువులతో చర్చలు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top