తండ్రి మరణం తట్టుకోలేక.. | Daughter Commits Suicide While Father Death in Peddapalli | Sakshi
Sakshi News home page

తండ్రి మరణం తట్టుకోలేక..

Feb 19 2020 9:25 AM | Updated on Feb 19 2020 12:47 PM

Daughter Commits Suicide While Father Death in Peddapalli - Sakshi

సాయిప్రియ (ఫైల్‌),గోదావరినదిపై పరిశీలిస్తున్న పోలీసులు

రామగుండంక్రైం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి గల్లంతయింది. గోదావరిఖని గంగానగర్‌ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఆరవెల్లి వసంతం ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమవారం జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ వద్ద గేదెలు అడ్డురావడంతో బైక్‌ పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో వసంతం మృతదేహాన్ని చెన్నూరుకు వాహనంలో తరలిస్తుండగా, కుటుంబ సభ్యులంతా కారులో ప్రయాణిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే మృతుడి కూతురు సాయిప్రియ (32) వాంతులు వస్తున్నాయని చెప్పడంతో కారుని  డ్రైవర్‌ నిలిపివేశాడు. వెంటనే కిందకు దిగిన సాయిప్రియ కుటుంబ సభ్యులు చూస్తుండగానే హఠాత్తుగా బ్రిడ్జి పైనుంచి నదిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె గల్లంతు కావడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. రివర్‌ పోలీసులు గమనించి తాడు సాయంతో ప్రయత్నించినా నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అప్పటికే ఆమె మునిగిపోయింది. రోధిస్తున్న కుటుంబసభ్యులు వసంతం మృతదేహంతో చెన్నూరు వెళ్లిపోయారు.

గాలింపు చర్యలు
గోదావరి నదిలోని నీటిలో దూకి గల్లంతైన సాయిప్రియ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శవంపైకి తేలితే తప్ప చేసేదేమి లేదని పేర్కొంటున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అనుకూలంగా లేదని పోలీసులు తెలిపారు. కా గా సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో సీఆర్‌టీగా పనిచేస్తోంది. ఘటనపై గోదావరిఖని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement