రెస్టారెంట్‌లో గొడవ.. దుస్తులిప్పి చితకబాదారు

Dalit youth stripped, flogged after altercation with restaurant owner - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. అహ్మదాబాద్‌ సబర్మతీ టోల్‌నాకా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌ వద్ద దళిత యువకుడిని బట్టలిప్పి చితకబాదారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో యువకుడిపై దాడిచేశారు. 2016లో ఉనాలో దళితులపై జరిగిన దాడి తరహాలో ఈ ఘటన ఉండటం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం గుజరాత్‌ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

దళిత యువకులైన ప్రగ్నేష్‌ పర్మార్‌, జేయేశ్‌ ఇక్కడి రెస్టారెంట్‌కు వచ్చారు. ఆ తర్వాత కాసేపటికి రెస్టారెంట్‌ ఓనర్‌తో వారికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొందరు అక్కడ గుమిగూడి ఆ ఇద్దరు యువకుల్ని కర్రలతో చితకబాదినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రగ్నేష్‌ చొక్కా విప్పి మరీ కర్రలతో చితకబాదినట్టు వెలుగులోకి వచ్చిన వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జయేశ్‌పైనా దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రగ్నేశ్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, దళిత యువకులపై దాడి చేసిన రెస్టారెంట్‌ ఓనర్‌ మహేశ్‌ థాకూర్‌తోపాటు శంకర్‌ థాక్రేపై సెక్షన్‌ 370 (హత్యాయత్నం) అభియోగం కింద అభియోగాలు నమోదుచేసిన పోలీసులు నిందితులను తర్వలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయకపోతే.. గుజరాత్‌ బంద్‌కు పిలుపునిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top