ఫిలింనగర్‌లో సిలిండర్‌ పేలుడు

cylinder blast in Filmnagar hyderabad - Sakshi

9 మందికి తీవ్ర గాయాలు

క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు

అపోలో ఆస్పత్రికి చిన్నారుల తరలింపు

పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు

మరో నలుగురిని ఉస్మానియాకు తరలింపు

బంజారాహిల్స్‌:  ఫిలింనగర్‌లోని బసవతారకానగర్‌లో ఆమ్లెట్లు వేసుకునేందుకు గ్యాస్‌పొయ్యి వెలిగిస్తుండగా అప్పటికే లీకవుతున్న గ్యాస్‌తో ఒక్కసారిగా మంటలు అంటుకొని సిలిండర్‌ పేలి ముగ్గురు పిల్లలు సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపినమేరకు.. బిహార్‌కు చెందిన అబ్దుల్‌(26), సాజిద్‌(28), ఎండీ నిసార్‌(28), ఎండీ ఇలియాస్‌(30)లు గురువారం రాత్రి విధులు ముగించుకొని బసవతారకనగర్‌లోని తమ ఇంటికి వచ్చారు. రాగానే నిసార్‌ ఆమ్లెట్‌ వేయడానికి గ్యాస్‌ పొయ్యి వెలిగించగా అప్పటికే గ్యాస్‌ లీకవుతుండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

సిలిండర్‌ పేలి ఇంటి పైకప్పు రేకులు దూరాన ఎగిసిపడ్డాయి. పక్కన ఉన్న ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమై మంటలు అంటుకున్నాయి. ఈ నలుగురితో పాటు పక్కింట్లో నివసిస్తున్న భార్యభర్తలు తిరుపతయ్య, బాలిదతో పాటు వారి పిల్లలు స్వామి, అనిల్, సంజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఐదుగురిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అబ్దుల్, సాజిద్, నిసార్, ఇలియాస్‌లు కూడా తీవ్ర గాయాలపాలవడంతో వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగి రేకులు విరిగిపోయి గోడలు కుప్ప కూలడంతో చుట్టుపక్కల వారు భయాందోళలకు గురయ్యారు. హాహా కారాలతో ఆ ప్రాంతమందా హృదయవిదారకంగా మారింది. బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top